
సాక్షి, హైదరాబాద్: సింగరేణి యాజమాన్యం, టీఆర్ఎస్, టీబీజీకేఎస్ సంఘం నాయకులు సంస్థను దోచుకుతింటున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సింగరేణిలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి తమకు సమాచారం ఉందన్నారు. నియామకాలు, ఇతర వ్యవహారాల్లో యాజమాన్యం, టీబీజీకేఎస్, టీఆర్ఎస్ నాయకులు కలసి అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు.
బుధవారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ, మైనింగ్ ప్రాంతాల వారీగా 11 చోట్ల రూ.1,490 కోట్ల విలువైన బొగ్గు ఉండాలని, అలాగే 74 లక్షల టన్నుల బొగ్గు ఉన్నట్లు సింగరేణి యాజమాన్యం లెక్కల్లో చూపినా, వాటిని పరిశీలిస్తే అందులో 10 శాతం కూడా లేదని అన్నారు. లెక్కల్లో తేడాలు, రికార్డుల్లో తప్పులపై విచారణ చేయాల్సిందిగా సీవీసీకి వినతి పత్రం ఇచ్చామని చెప్పారు.