Sakshi News home page

వైద్య, ఆరోగ్యశాఖలో పదోన్నతులు

Published Sat, May 7 2016 4:51 AM

Medical, health promotions approved

సర్క్యులర్ జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
 సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల్లో పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సర్క్యులర్ జారీచేసింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి శుక్రవారం రాష్ట్ర వైద్యుల సంఘంతో జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  ప్రస్తుతం పదోన్నతులు, బదిలీలపై నిషేధం ఉన్నం దున పాక్షిక పదోన్నతులకు మంత్రి లక్ష్మారెడ్డి అంగీకరించారు. రోగులకు మెరుగైన సేవలు అందించడం కోసం.. ఉద్యోగుల్లో ఉత్సాహం నింపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల మీద నిషేధం ఉందన్నారు. మరోవైపు ఉద్యోగుల విభజన ప్రక్రియ కూడా పూర్తికాలేదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 695 పదోన్నతులు, బదిలీలపై సడలింపు ఇచ్చిందన్నారు. దీంతో పాక్షిక బదిలీలు, పదోన్నతులు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

 గాంధీ ఆస్పత్రిపై సమీక్ష...
 మంత్రి లక్ష్మారెడ్డి గాంధీ ఆస్పత్రిలో సేవలపై సమీక్ష నిర్వహించారు. ఎమర్జెన్సీ సేవలను వేగంగా ఆధునికీకరించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర అంశాలను స్వయంగా పర్యవేక్షించాలని తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) సీఈవో ను ఆదేశించారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ సీఈవో లక్ష్మారెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ జె.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement