ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని ఓ యువకుడు మృతి చెందాడు.
లంగర్హౌస్ (హైదరాబాద్) : ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్ లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లంగర్హౌస్ అంబేద్కర్ నగర్లో నివాసముండే దర్శన్ కుమారుడు గిరి(22) వృత్తిరీత్యా పెయింటర్. ఉండే ఇల్లు ఇరుకుగా ఉండడంతో పక్కనే గుడిసె ఏర్పాటు చేసుకొని అందులో వంట చేసుకుంటున్నారు.
కాగా ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గిరి పక్కనే ఉన్న గుడిసెలోకి వంట చేస్కోవడానికి వెళ్లాడు. కొద్దిసేపటికి అరుపులు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూడగా గిరి మంటల్లో చిక్కుకొని ఉన్నాడు. వెంటనే స్పందించిన వారు మంటలు ఆర్పారు. దీనిపై సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న గిరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం ప్రారంభించేలోపు అతను మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.