అలరించిన  ‘మల్లేశం’ యూనిట్‌

Mallesham Movie Unit in Khammam - Sakshi

ఖమ్మంమయూరిసెంటర్‌: చేనేత కార్మికురాలైన తల్లి కష్టాలను చూసి చలించి, ఆ కష్టాలను తీర్చాలనే లక్ష్యంతో ఆసుయంత్రం కనుగొని జాతీయ గుర్తింపు పొంది, పద్మశ్రీ అవార్డు అందుకున్న చింతకింద మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన మల్లేశం చిత్ర యూనిట్‌ సభ్యులు మంగళవారం నగరంలోని సాయిరాం థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమాను తిలకించారు. సినీ డైరెక్టర్‌ రాజు, కథానాయిక అనన్య, హీరో తల్లి పాత్రలో నటించిన ఝాన్సీ, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రేక్షకులను కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ సినిమా ఘన విజయం సాధించిందని, చింతకింద మల్లేశం జీవిత కథ అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. ఖమ్మం నగర పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు, పద్మశాలీ సంఘ కుటుంబ సభ్యులకు ఉచితంగా సినిమా టికెట్లను అందజేశారు. సినిమా విజయంతం కావడాన్ని హర్షిస్తూ సంఘం ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. అనంతరం చిత్ర బృందాన్ని సన్మానించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారుడు కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top