అక్రమాల చైతన్యం | land danda came out in Co-operative Housing Society Ltd. | Sakshi
Sakshi News home page

అక్రమాల చైతన్యం

Jul 14 2014 3:54 AM | Updated on Sep 2 2017 10:15 AM

అక్రమాల చైతన్యం

అక్రమాల చైతన్యం

కాజీపేట సహకార హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (చైతన్యపురి కాలనీ)లో భారీగా భూముల దందా వెలుగులోకి వచ్చింది. రూ.14 కోట్ల విలువైన భూములను సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా కొందరికి కట్టబెట్టారు.

సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాజీపేట సహకార హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (చైతన్యపురి కాలనీ)లో భారీగా భూముల దందా వెలుగులోకి వచ్చింది. రూ.14 కోట్ల విలువైన భూములను సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా కొందరికి కట్టబెట్టారు. సొసైటీ పరిధిలో మరో రూ.50కోట్ల విలువైన 10వేల గజాల స్థలాలు సభ్యులు కానివారి ఆధీనంలో ఉన్నాయి.

మునిసిపల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ స్థలాల్లో వాణిజ్య భవనాలు నిర్మించారు. కాజీపేట సహకార హౌసింగ్ సొసైటీ (చైతన్యపురి కాలనీ) భూముల విషయంలో సహకార శాఖ నిర్వహించిన విచారణలో అక్రమాలు వెలుగు చూశాయి. ‘పాలకమండలి ఆమోదం లేకుండా సొసైటీ భూముల క్రయవిక్రయాలు జరిగాయి. సొసైటీలో సభ్యులు కాని వారి చేతుల్లో భూములు ఉన్నాయి. సొసైటీ ప్రాథమిక నియమావళిని పూర్తిగా ఉల్లంఘించారు.
 
 సహకార, మునిసిపల్ చట్టాలను పాతరేసి చేసిన ఈ అక్రమ నిర్మాణాల బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి’ అని విచారణ నివేదిక పేర్కొంది. కాజీపేట కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్, చైతన్యపురి కాలనీ, కాజీపేట 1961 మే 25న రిజిస్టర్ (295టీకే) అయింది. రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ(ఇప్పుడు నిట్) ఎదురుగా ఉన్న ప్రధాన రహదారికి ఆనుకుని చైతన్యపురి కాలనీ ఉంది. ఆర్‌ఈసీ బోధన సిబ్బంది కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఏర్పడిన ఈ కాలనీలో హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం 20.32 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రభుత్వం సొసైటీకి స్థలం కేటాయించినప్పుడు ఈ ప్రాంతం సెంట్రల్ కమర్షియల్ జోన్‌గా ఉండేది. సొసైటీ విజ్ఞప్తితో పురపాలక శాఖలోని 598 ఉత్తర్వుల ప్రకారం ఈ భూములను నివాస ప్రాంతంగా మార్చారు.
 
1986 అక్టోబర్ 5న జరిగిన సొసైటీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం ప్రకారం సొసైటీలో అప్పటివరకు సభ్యులుగా ఉన్న139మందికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఒక్కో సభ్యుడికి 425 గజాల చొప్పున కేటాయించాలని నిర్ణయించారు. ఇక్కడే భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. చైతన్యపురి కాలనీ ప్రాంతంలో నివాసం ఉండే అజ్మీరా విజయలక్ష్మీనాయక్ సొసైటీలో ఖాళీగా ఉన్న 100గజాల 47ఎ ప్లాట్‌ను తనకు కేటాయించాలని కోరగా సొసైటీ తిరస్కరించింది. ఈమె ఫిర్యాదు మేరకు సహకార శాఖ కమిషనర్ సొసైటీ అంశాలపై విచారణకు ఆదేశించారు.
 
సహకార శాఖ  51 సెక్షన్ ప్రకారం విచారణ చేపట్టింది. 2014 జనవరి 4 నుంచి విచారణ మొదలైంది. వారం క్రితం ఈ విచారణ ముగిసింది. విచారణ నివేదిక జిల్లా సహకార అధికారికి చేరింది. విచారణలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. విచారణ నివేదిక ఆధారంగా సహకార శాఖ... పాలకమండలి బాధ్యులపై, అక్రమార్కులపై చర్యలకు సన్నద్ధమవుతోంది. రాజకీయ పలుకుబడి దండిగా ఉన్న చైతన్యపురి కాలనీ అక్రమార్కులపై ఎలాంటి చర్యలు ఉంటాయనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఏర్పడిన కాలనీలో అక్రమాలపై జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
 
 విచారణ నివేదిక సారాంశం...
* సొసైటీలో సభ్యులుకాని వి.సత్యమూర్తి (కాంట్రాక్టర్), జనార్దనరెడ్డి(వ్యాపారవేత్త), మాణిక్‌లాల్ దాగా (వ్యాపారవేత్త) తదితరుల ఆధీనంలో సొసైటీకి చెందిన 10 వేల చదరపు గజాల స్థలం ఉంది. దీని విలువ రూ.50 కోట్లు ఉంటుంది. సొసైటీ నియమావళిలోని 42బీ (10) విరుద్ధంగా సొసైటీ భూములను కొనుగోలు చేసిన వీరు... పురపాలక శాఖకు సంబంధించి 598 ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వాణిజ్య భవనాలు నిర్మించారు. నివాసయోగ్యమైన ఈ సొసైటీ పరిధిలో వాణిజ్య భవనాలు నిర్మించి హోటళ్లు, ప్రైవేటు బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులకు, ఇతర వాణిజ్య అవసరాలకు అద్దెకు ఇచ్చారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ఈ స్థలాలను సొసైటీ స్వాధీనం చేసుకోవాలి.
* డివిజనల్ సహకార అధికారి అనుమతి లేకుండా సొసైటీ పరిధిలోని ఖాళీ స్థలాలను సొసైటీ పాలకమండలి ఎవరికీ విక్రయించకూడదు. దీనికి విరుద్ధంగా, చైతన్యపురి కాలనీలోని 750 గజాల స్థలాన్ని సొసైటీలో సభ్యుడు కాని ఎం.నర్సింహారెడ్డికి విక్రయించారు. ఇలాగే 705 గజాల స్థలం సభ్యుడుకాని నాగరాజు అనే వ్యక్తి అధీనంలో ఉంది. వీరికి ఇచ్చిన ఈ స్థలం ప్రస్తుత మార్కెట్ విలువ రూ.2.75 కోట్లు ఉంటుంది.
* సొసైటీ నిబంధనల ప్రకారం కుటుంబానికి ఒక ప్లాటు మాత్రమే కేటాయించాలి. ఒక్కో సభ్యుడికి 425 చదరపు గజాల చొప్పున కేటాయించాలని నిర్ణయించినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీనికి విరుద్ధంగా సి.జగన్నాథరెడ్డి, వి.ఉషశ్రీలకు రెండు చొప్పున ప్లాట్లను కేటాయించారు. వీరిద్దరికీ కేటాయించిన ఈ అదనపు స్థలం మార్కెట్ విలువ ఇప్పుడు రూ.3.50 కోట్లు ఉంది.
* సొసైటీలో సభ్యులుగా ఉన్న వి.సంధ్యశ్రీ, సి.రఘువీరారెడ్డి, సి.జయశ్రీ, సి.దయాకర్‌రెడ్డిలకు 800 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలాన్ని కేటాయించారు. ఇలా పరిమితి కంటే ఎక్కువగా కేటాయించిన ఈ స్థలాల మార్కెట్ విలువ ఇప్పుడు రూ.7.50 కోట్లు ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement