విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ను దూషించి, అతడి విధులకు ఆటంకపరిచాడన్న అభియోగంతో అధికారపార్టీ మండల
కేతేపల్లి : విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ను దూషించి, అతడి విధులకు ఆటంకపరిచాడన్న అభియోగంతో అధికారపార్టీ మండల అధ్యక్షుడిపై బుధవారం కేతేపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భీమారం గ్రామానికి చెందిన కోట ఈదమ్మకు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఆసరా పింఛన్ మంజూరు కాలేదు. ఇందుకు స్థానికంగా ఉన్న టీడీపీ నేత, వైస్ ఎంపీపీ కోట ము త్తయ్య కారణమంటూ ఆమె మనువడు కోట శ్రీనివాస్ మంగళవారం జరిగిన గ్రామసభలో వారిని దూషించా డు. దీంతో ఆగ్రహించిన ముత్తయ్య బుధవారం శ్రీనివాస్పై కేతేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కౌం టర్గా కోట ఈదమ్మ పేరిట రాసిన ఫిర్యాదును కోట శ్రీనివాస్ తమ్ముడు కిరణ్ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చాడు.
ఈసమయంలో స్టేషన్లో గార్డు డ్యూటీలో ఉన్న హెడ్కానిస్టేబుల్ యాట రమేష్ ఫిర్యాదును పరిశీలించా డు. బాధితులు లేకుండా ఫిర్యాదు తీసుకోమని స్పష్టం చేశాడు. దీంతో కిరణ్ పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోవడం లేదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్కు తెలిపాడు. ఈ విషయమై పోలీస్స్టేషన్కు వచ్చిన శ్రీనివాస్యాదవ్ హెడ్కానిస్టేబుల్తో వాదనకు దిగాడు. అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ అతడిపై దాడికి పాల్పడ్డాడు. సంఘటనపై రమేష్ చేసిన ఫిర్యాదు మేరకు నల్లగొండ డీఎస్పీ బి.రాములునాయక్ సాయంత్రం కేతేపల్లి పోలీస్స్టేషన్ సందర్శించారు.
ఎస్ఐ శ్రీనివాస్తో పాటు విధినిర్వహణలో ఉన్న సిబ్బందిని వ్యక్తిగతంగా విచారించి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ హెడ్కానిస్టేబుల్ విధులకు అటంకం కలిగించిన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న శ్రీనివాస్ను పట్టుకునేందుకు బృందాలు గాలిస్తున్నట్లు చెప్పారు. డీఎస్పీ వెంట నకిరేకల్ రూరల్ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ ఎ.శ్రీనివాస్లు ఉన్నారు.