మండే కన్నీటి బిందువు కాళోజీ | Kaloji anniversary day celebrations | Sakshi
Sakshi News home page

మండే కన్నీటి బిందువు కాళోజీ

Nov 14 2014 2:08 AM | Updated on Sep 2 2017 4:24 PM

మండే కన్నీటి బిందువు కాళోజీ

మండే కన్నీటి బిందువు కాళోజీ

కాళోజీ నారాయణరావు మండే కన్నీటి బిందువని, నిలువెత్తు మానవత్వానికి ప్రతీకగా నిలిచాడని న్యాయమూర్తి మంగారి రాజేందర్ (జింబో) అన్నారు.

హన్మకొండ కల్చరల్ : కాళోజీ నారాయణరావు మండే కన్నీటి బిందువని, నిలువెత్తు మానవత్వానికి ప్రతీకగా నిలిచాడని న్యాయమూర్తి మంగారి రాజేందర్ (జింబో) అన్నారు. హన్మకొండ హంటర్‌రోడ్‌లోని వరంగల్ పబ్లిక్ స్కూల్‌లో కాళోజీ ఫౌండేషన్, మిత్రమండలి ఆధ్వర్యంలో గురువారం కాళోజీ సోదరుల యాది సభ జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కాళోజీ నారాయణరావు, కాళోజీ రామేశ్వర్‌రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంగారి రాజేందర్ మాట్లాడుతూ ఉర్దూ భాష భారతదేశంలోనే పుట్టిందన్నారు.

పాకిస్తాన్‌లో అధికార భాష ఉర్దూ అయినప్పటికీ...  ఆ భాషను భారతదేశ ప్రజలే ఎక్కువగా మాట్లాడతారని తెలిపారు. అదేవిధంగా సంస్క­ృతం హిందూ మతానికి చెందినదిగా భావించడం తప్పన్నా రు. న్యాయవ్యవస్థతోనూ, మనుషులతోనూ, మానవీయ విలువలతోనూ సంబంధం ఉన్న ప్రజల మనిషి పరిపూర్ణ మానవుడు కాళోజీ అని కొనియూడారు.తెలంగాణ వచ్చిన తర్వాత కాళోజీ వర్ధంతి సభకు వందలాది మంది వస్తారని ఆశించామని, అలా జరగకపోవడం బాధాకరమేనన్నారు. ప్రస్తుతం కవిత్వం అనేది ఫేస్‌బుక్ ద్వారా చర్చలో ఉందన్నారు.

డాక్టర్ ఎం.విజయ్‌కుమార్ మాట్లాడుతూ కాళోజీ రామేశ్వర్‌రావు రాసిన ఉర్దూ సాహిత్యంలోని విశేషాలను వివరించారు.  ఎస్.జీవన్‌కుమార్ మాట్లాడుతూ కాళోజీ రామేశ్వర్‌రావుకు ఉర్ధూ అంటే ఎనలేని మక్కువ అని... చెరుకు గడలోని తీపి రసంలా ఉంటుందని అనేవారని గుర్తుచేశారు. కాళోజీ నారాయణరావు విషయానికి వస్తే ప్రజాస్వామ్యం గురించి ఆయన రాసినంతగా ఎవ్వరూ రాయలేరని,  ప్రభుత్వ జవాబుదారీతనం గురించి అడిగేవారని పేర్కొన్నారు. కర్షకా నీ కర్రు కదిలినన్నాల్లే అన్న కవితను ఈనాటి పరిస్థితులలో గుర్తుంచుకోవాల్సిన అవసరముందన్నారు. నాగిళ్ల రామశాస్త్రి మాట్లాడుతూ కాళోజీ అవార్డును సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డికి ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉన్నందున  మరో ప్రత్యేక సమావేశంలో అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. పొట్లపల్లి శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. కవి లోచన్, కాళోజీ కుమారుడు రవికుమార్, పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్, శోభ దంపతులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ అంపశయ్య నవీన్, ఆచార్య కాత్యాయని విద్మహే, టి.జితేందర్‌రావు, మహ్మద్ సిరాజూద్దిన్, అన్వర్, కుందావజుజల కృష్ణమూర్తి, చెలిమె సుధాకర్, బిల్లా మహేందర్, రంగ చక్రపాణి, పొట్లపల్లి ధరణీశ్వర్‌రావు, రంగు చక్రపాణి, కాళోజీ అభిమానులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement