ద్రోహులమంటూ యాత్ర చేస్తారా? | Harish rao takes on Telangana TDP leaders | Sakshi
Sakshi News home page

ద్రోహులమంటూ యాత్ర చేస్తారా?

Oct 8 2014 2:43 AM | Updated on Aug 11 2018 4:44 PM

ద్రోహులమంటూ యాత్ర చేస్తారా? - Sakshi

ద్రోహులమంటూ యాత్ర చేస్తారా?

టీటీడీపీ నేతలపై టీఆర్‌ఎస్ మంత్రులు, నేతలు మండిపడ్డారు. మంగళవారం వారు వేర్వేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతల బస్సు యాత్రపై కస్సుబుస్సు అయ్యారు.

తెలుగుదేశం పార్టీ నేతలకు మంత్రి హరీశ్‌రావు ప్రశ్న
 
 సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ నేతలపై టీఆర్‌ఎస్ మంత్రులు, నేతలు మండిపడ్డారు. మంగళవా రం వారు వేర్వేరుగా  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతల బస్సు యాత్రపై కస్సుబుస్సు అయ్యారు.  తెలంగాణ ద్రోహులం, చంద్రబాబుకు తాబేదారులమంటూ  బస్సుయాత్ర చేస్తారా అని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతుల గురించి టీడీపీ నేతలు మాట్లాడుతుంటే.. ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘కరెంటు చార్జీలను తగ్గించాలని అడిగితే.. ప్రజల్ని పిట్టలను కాల్చినట్టుగా చంపి, బ్యాంకు లోన్లు తీసుకున్నవారిపై క్రిమినల్ కేసులు పెట్టించిన చంద్రబాబు చరి త్రను యాత్రలో మీరు వివరిస్తారా’ అని నిల దీశారు. తెలంగాణలో కరెంటు కొరతకు చంద్రబాబు, కాంగ్రెస్ కారణమని విమర్శించారు.  
 
 రేవంత్‌ను బజారుకీడుస్తాం..
 టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అవినీతిని బయటపెట్టి, బజారుకీడుస్తామని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ హెచ్చరించారు. తెలంగాణ విద్యుత్ కొరత, ఖమ్మం జిల్లాలోని 7 ముంపు మండలాల గురించి చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదన్నారు.
 
 ప్రతిపక్షాలవి అర్థంలేని విమర్శలు
 వరంగల్: కాంగ్రెస్, టీడీపీ నాయకులు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని  ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం హన్మకొండలో జరిగిన టీఆర్‌ఎస్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనతోనే తెలంగాణకు విద్యుత్ కష్టాలు వచ్చాయన్నారు.
 
 తెలంగాణలో టీడీపీ ఉంటే.. విద్యుత్ ఇవ్వు
 కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఉంటే,  తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్  ఇవ్వాలని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్‌లో జరిగిన టీఆర్‌ఎస్ సమావేశంలో మాట్లాడారు. యూనిట్‌కు రూ.14 ఖర్చుచేసైనా కొనుగోలు చేయాలని కేసీఆర్ ఆదేశించారన్నారు.
 
 ఎర్రబెల్లిని టీఆర్‌ఎస్‌లోకి రానివ్వం
 వరంగల్: టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయా కర్‌రావును టీఆర్‌ఎస్‌లోకి రానివ్వబోమని ఆ పార్టీ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు. మంగళ వారం ఇక్కడ జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కడియం మాట్లాడుతూ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న పార్టీలు ఎటూ పాలుపోక విమర్శలు చేస్తున్నాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement