జల్సాల కోసం టూవీలర్స్ చోరీ | Gang of thieves arrested | Sakshi
Sakshi News home page

జల్సాల కోసం టూవీలర్స్ చోరీ

Jul 3 2015 7:33 PM | Updated on Sep 4 2018 5:16 PM

జల్సాల కోసం ద్విచక్రవాహనాల దొంగతనాలకు అలవాటుపడిన ఏడుగురిని పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పంజగుట్ట (హైదరాబాద్) : జల్సాల కోసం ద్విచక్రవాహనాల దొంగతనాలకు అలవాటుపడిన ఏడుగురిని పంజగుట్ట పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం...తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వేమన అయ్యప్ప అలియాస్ అమిత్ అలియాస్ సంజు అలియాస్ బన్ని(21) నగరంలో బీజేఆర్ నగర్ యూసూఫ్‌గూడలో నివసిస్తుంటాడు. జల్సాలకు అలవాటుపడిన ఇతడు పంజగుట్ట మార్కెట్ బస్తీకి చెందిన కొర్ర మహేష్ అలియాస్ రాజా(23), బేగంపేట ప్రకాశ్‌ నగర్‌కు చెందిన అభిజిత్ చెటర్జి అలియాస్ సోన(20), బేగంపేట మయూరి మార్గ్‌కు చెందిన టేకు దొరబాబు అలియాస్ దొర (19), అమీర్‌పేటకు చెందిన తిరుమల వెంకటేశ్ అలియాస్ వెంకట్ (24), యూసూఫ్‌గూడకు చెందిన గుమ్మడి రవి కుమార్ అలియాస్ రవి, లడ్డు (19), బేగంపేటకు చెందిన కె. సచిన్ అలియాస్ నాని (19)లతో కలసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.

వీరిలో అయ్యప్ప తాళం వేసి ఉన్న ద్విచక్ర వాహనాలను ఎత్తుకుపోవటంలో దిట్ట. వీరు దొంగిలించిన వాహనాలను నంబర్‌ ప్లేట్లు మార్చి తక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బుతో పబ్‌లకు వెళ్తూ, స్నూకర్స్ ఆడుతుంటారు. వీరిపై పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 4, రాంగోపాల్‌పేట పరిధిలో 1, కూకట్‌పల్లి పరిధిలో 1, నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో 1 ద్విచక్రవాహనాల దొంగతనం కేసులున్నాయి. దొంగిలించిన వాహనంపై గురువారం అమీర్‌పేటలో ప్రధాన నిందితుడు అయ్యప్ప వెళుతుండగా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అతన్ని వాహన పత్రాలు చూపమని అడగడంతో తడబడ్డాడు. వెంటనే అతన్ని అరెస్టు చేసి విచారించగా చేసిన దొంగతనాల చిట్టా బయటపెట్టాడు. దీంతో నిందితులందరినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement