వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో బుధవారం నలుగురు మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామానికి చెందిన రైతు రుద్రగోని
వలిగొండ/పెద్దవూర/మొయినాబాద్: వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో బుధవారం నలుగురు మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామానికి చెందిన రైతు రుద్రగోని భూమయ్య (65)కు వలిగొండ మండల పరిధిలోని గోకారం గ్రామపంచాయతీ పరిధిలో వ్యవసాయ భూమి ఉంది. మంగళవారం వీచిన ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగి పొలం గట్టుపై పడింది. భూమయ్య పొలంగట్ల మీద నడుస్తుండగా విద్యుత్ తీగ కాళ్లకు తగిలి షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కొమటికుంటతండాలో కొత్త ఇంటికి నీరు కొట్టేందుకు మోటార్ వేస్తుండగా విద్యుదాఘాతంతో నరేష్(22) మృతిచెందాడు.
అదే విధంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామంలో బొలిగిద్ద గోపాల్ (55), కుమారుడు రవికుమార్ (23) బుధవారం తెల్లవారుజామున పొలానికి వెళ్లారు. బోరు మోటారు నడవకపోవడంతో రవికుమార్ స్టార్టర్ డబ్బాను తెరిచి చూశాడు. ఫ్యూజు పోవడంతో దాన్ని వేసే క్రమంలో అతనికి కరెంట్ షాక్ కొట్టింది. గమనించిన తండ్రి గోపాల్ కొడుకును కాపాడేందుకు ప్రయత్నించి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు.