వడదెబ్బతో ఐదుగురు మృతి | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఐదుగురు మృతి

Published Mon, May 15 2017 1:45 AM

Five deaths due to sun effect

సాక్షి, నెట్‌వర్క్‌: భానుడి ప్రతాపానికి ఆదివారం రాష్ట్రంలోని వేర్వేరుచోట్ల ఐదుగురు బలయ్యారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పట్టణానికి చెందిన ఎస్‌కే రహమాన్‌(65), కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రాచకొండ లింగయ్య(70) ఎండవేడిమికి అస్వస్థతకు గురై మృత్యువాతపడ్డారు. అలాగే, మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తంగళ్లపెల్లికి చెందిన రాంటేంకి పోశవ్వ(46) వడదెబ్బతో మృతిచెందింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన చంద్రయ్య(65) కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రానికి చెందిన మారపెల్లి స్వామి(50) కూడా ఎండ వేడిమి తట్టుకోలేక మృతి చెందారు.

ఎండవేడికి 11 నెమళ్లు మృతి
ఆత్మకూర్‌: ఎండలు తీవ్రరూపం దాల్చడం తో పక్షులు విలవిలలాడిపోతున్నాయి. ఒకేసారి 11 నెమళ్లు మృత్యువాతపడ్డ సంఘటన ఆదివారం వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో వెలుగుచూసింది. స్థానిక పరమేశ్వరస్వామి చెరువుకు సమీపంలో 11నెమళ్లు అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సీహెచ్‌ రాజు బృందం సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా 9నెమళ్లు చనిపోయి ఉండగా రెండు నెమళ్లు ప్రాణాలతో ఉండటాన్ని గమనించి స్థానిక పశువుల ఆస్పత్రికి తరలించారు. పశువైద్య అధికారి వాటిని పరీక్షించగా అప్పటికే అన్ని నెమళ్లు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని సంబంధిత ఫారెస్ట్‌ అధికారులకు అందించామని, పంచనామా నిర్వహించిన అనంతరం వాటిని ఖననం చేయిస్తామని ఎస్సై తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement