అత్యవసరాల తరలింపునకు రైల్వే పార్సిల్‌ వ్యాన్లు | First Train From Secunderabad With 92 Tonnes Sells Goods To Howrah | Sakshi
Sakshi News home page

అత్యవసరాల తరలింపునకు రైల్వే పార్సిల్‌ వ్యాన్లు

Apr 4 2020 1:59 AM | Updated on Apr 4 2020 1:59 AM

First Train From Secunderabad With 92 Tonnes Sells Goods To Howrah - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున అత్యవసర మందులు, పండ్లు, ఇతర వస్తువులకు పలు ప్రాంతాల్లో కొరత ఏర్పడింది. దీంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో రైల్వే శాఖను కేంద్రం అప్రమత్తం చేసింది. ప్రత్యేకంగా పార్సిల్‌ వ్యాన్లను వెంటనే పట్టాలెక్కించాలని ఆదేశించింది. ఈమేరకు సికింద్రాబాద్‌ నుంచి హౌరాకు తొలి పార్సిల్‌ రైలు బయలుదేరింది. ఇందులో 92 టన్నుల సామగ్రిని తీసుకెళ్లారు. పుచ్చకాయలు, మామిడిపండ్లు, నిమ్మకాయలు, మందులు, వైద్య పరికరరాలు, ఇతర యంత్రాల విడిభాగాలు, కోడిగుడ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, చేపలు, నెయ్యి తదితరాలున్నాయి. మొత్తం 3,005 డబ్బాల్లో వీటిని తరలించారు.

సాధారణంగా పార్సిల్‌ వ్యాన్‌ గంటకు 30 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ప్రస్తుతం సరుకు తొందరగా డెలివరీ కావాల్సిన పరిస్థితి ఉండటం, ట్రాక్‌పై ఇతర రైళ్లు నడవటం లేనందున ఈ రైలును గంటకు 55 కి.మీ. వేగంతో నడపటం విశేషం. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో చాలా వస్తువులకు కొరత ఉన్న నేపథ్యం లో మరిన్ని పార్సిల్‌ వ్యాన్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేశ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు వ్యాపారులతో మాట్లాడి ఏర్పా ట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. సరుకును తరలించే ముందు వ్యాన్లను శుభ్రం చేశారు. ఈ పనుల్లో నిమగ్నమైన సిబ్బం ది భౌతిక దూరాన్ని పాటించటమే కాకుం డా, వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకునేలా చూశామని రాకేశ్‌ పేర్కొన్నారు.

శానిటైజర్, మాస్కుల తయారీ 
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తన సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులను రైల్వేశాఖ అందుబాటులో ఉంచుతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయినా, అత్యవసర పనుల కోసం కొంతమంది సిబ్బంది విధుల్లో ఉంటున్నారు. వారందరికీ శానిటైజర్లు, మాస్కులను అందిస్తున్నారు. వాటిని ఎక్కడి నుంచో కొనుగోలు చేయకుండా సొంతంగానే తయారు చేసుకోవటంపై రైల్వే దృష్టి సారించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 17,800 మాస్కులు, 2,672 లీటర్ల శాని టైజర్‌ను సిబ్బంది తయారు చేశారు. వా టిని అన్ని డివిజన్లలో అత్యవసర విధుల్లో ఉన్న సిబ్బందికి అందజేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుం టూరు, గుంతకల్, నాందెడ్‌ డివిజన్లతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న రైల్వే వర్క్‌షాపుల్లో తయారు చేశారు. వీటితో పాటు అన్ని ప్రాంతాల్లో సిబ్బంది ఎప్పటికప్పుడు చేతులు కడుక్కునేందుకు సబ్బులు, కావాల్సినన్ని నీళ్లు అందుబాటులో ఉంచారు. వారు విధిగా భౌతిక దూరాన్ని పాటించాలని అధికారులు ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement