సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఓ ఏజెన్సీ ఓఎన్జీసీలో ఉద్యోగాల పేరుతో దేశ వ్యాప్తంగా నిరుద్యోగులకు ఎర వేసింది. దీనికి హైదరాబాద్లోనూ సబ్ ఏజెన్సీ ఉంది. కొందరు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, మెడికల్ టెస్ట్లు సైతం పూర్తి చేసింది. ఈ గ్యాంగ్ జారీ చేసిన బోగస్ నియామక పత్రాలతో అనేక మంది ఢిల్లీలోని ఓఎన్జీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఇలా విషయం బయటకు రావడంతో అక్కడి వసంత్కుంజ్, క్రైమ్ బ్రాం చ్ల్లో కేసులు నమోదయ్యాయి. పోలీసులు గుర్తించిన బాధితుల్లో ఏడుగురు హైదరాబాద్కు చెందిన వారూ ఉన్నట్లు తెలిసింది.
ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఓ ప్లేస్ మెంట్ ఏజెన్సీ దేశంలోని ప్రధాన నగరాల్లో సబ్ ఏజె న్సీలు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. దీనిలో సత్బీర్ కీలకంగా వ్యవహరించారు. తమకు రాజకీయ, అధికార వర్గాల్లో భారీ పలుకుబడి ఉందంటూ ప్రచారం చేసుకున్నారు. ఓఎన్జీసీలో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మినిస్ట్రీ కోటా పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయరంటూ నమ్మించాడు. వీటిని రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు మాత్రమే భర్తీ చేస్తారంటూ ప్రచారం చేసుకున్నారు.
హైదరాబాద్లో ఉన్న సబ్ ఏజెన్సీ సైతం ఇలానే చెప్పింది. ఆకర్షితులైన వారి నుంచి తొలుత కొంత మొత్తం అడ్వాన్స్గా తీసుకున్నారు. ఆపై వీరికి ప్రాథమిక మౌఖిక పరీక్షలు పూర్తి చేసి ఢిల్లీకి తరలించారు. అక్కడి కృషి భవన్లో తుది దశ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆ కార్యాలయం లాబీలో ఉన్న మోసగాళ్ల ఏజెంట్లు తామే ఓఎన్జీసీ అధికారులమని నమ్మించి, అక్కడే తతంగం పూర్తి చేశారు. ఇది జరిగిన తర్వాత వారికి గ్రేటర్ నోయిడాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేయించి సర్టిఫికెట్లు జారీ చేశారు.
తర్వాత మిగిలిన మొత్తం వసూలు చేసి ఓఎన్జీసీ లోగోతో కూడిన బోగస్ నియామక పత్రాలు జారీ చేశారు. ఒక్కో ప్రాంతానికి చెందిన వారికి ఒక్కో తేదీ ఇస్తూ, ఢిల్లీలో ఉన్న ఓఎన్జీసీ కార్యా లయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించారు. అక్కడకు వెళ్లిన బాధితుల్లో ఏడుగురు నగరానికి చెందిన వారున్నారు. ఒక్కొక్కరూ రూ.10 లక్షల చొప్పున మోసగాళ్లకు చెల్లించారు. ఈ లేఖలు చూసిన ఓఎన్జీసీ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న ముఠా చేసిన స్కాంగా తేల డంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది.