నకిలీ వస్తువులపై ఉక్కుపాదం: ఈటల

Etela Rajender Says Govt is focused on fake goods - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్మగ్లింగ్, నకిలీ, గుడుంబా, పేకాట క్లబ్బులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపినట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఫిక్కీ కాస్కేడ్‌ (కమిటీ ఎగైనెస్ట్‌ స్మగ్లింగ్‌ అండ్‌ కౌంటర్‌ ఫిటింగ్‌ యాక్టివిటీస్‌ డిస్ట్రాయింగ్‌ ద ఎకానమీ) సంస్థ ‘నకిలీ, స్మగ్లింగ్‌పై పోరాటం, ఆర్థికాభివృద్ధి వేగవంతం అత్యవసరం’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో డబ్బే ప్రధానంగా వ్యాపారాలు జరుగుతున్నాయని, నైతిక విలువలు, ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదన్నారు. చట్టాలను చేసే వాళ్లు నిబద్ధతతో పనిచేస్తే నకిలీలను నిర్మూలించవచ్చన్నారు.

ఉత్పత్తి రంగ నిపుణులు నకిలీ వస్తువులపై ప్రభుత్వానికి సమాచారం అందించాలన్నారు. నకిలీ వస్తువులు ఉత్పత్తి  చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కస్టమ్స్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ.. వినియోగదారులు వస్తువులు కొనేటప్పుడు రశీదు తీసుకోవాలని, దీనివల్ల 80 శాతం నకిలీ వస్తువులను నిర్మూలించవచ్చన్నారు. కార్యక్రమంలో ఫిక్కీ చైర్మన్‌ దేవేంద్ర సురానా తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top