ప్రమాదకరంగా మిషన్ భగీరథ గుంతలు
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
గుంతలు పూడ్చాలని వినతులు
వేములవాడఅర్బన్: వేములవాడ అర్బన్ మండలంలోని గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి నల్లా ఏర్పాటు చేసేందుకు పైప్ లైన్ కోసం తవ్విన గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి. గుంతలు తీసి రోజులు గడుస్తున్నా, పూడ్చకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తిప్పాపూర్ గ్రామంలోని వేములవాడ కరీంనగర్ రహదారిలోని సౌరల కాలనీ వద్ద రోడ్డు పక్కన గుంతలు తీసి సరిగా పూడ్చకపోవడంతో రాత్రిపూట ప్రమాదకరంగా ఉందని వాహనాదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల వారం రోజుల క్రితం రహదారి వెంట వెళ్తున్న లోడ్తో ఉన్న లారీ రాత్రివేళ ఆ గుంతలో దిగబడి ఎటు వెళ్లకుండా అక్కడే నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే క్రేన్ సహాయంతో బయటికి తీశారు. అధికారులు స్పందించి వెంటనే రహదారుల వెంట ఉన్న మిషన్ భగీరథ గుంతలను పూర్తిగా పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.