దిగివచ్చిన సీబీఐటీ యాజమాన్యం | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 17 2017 9:40 AM

CBIT fee row, management agrees students demands - Sakshi

సాక్షి, మణికొండ: గండిపేటలోని  చైతన్యభారతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాల( సీబీఐటీ) విద్యార్థులు వారం రోజుల పాటు చేపట్టిన ఆందోళనలతో యాజమాన్యం దిగి వచ్చింది. మొదటి, రెండో సంవత్సరం ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గతంలో ఉన్న ఫీజు రూ. 1,13,500 నుంచి ఏకంగా రూ. 2లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. ఫీజులను పెంచుతూ కళాశాల యాజమాన్యం నిర్ణయం తీసుకున్న  మరుసటిరోజు నుంచే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పలు విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థుల ఆం దోళనకు మద్దతు ప్రకటించి విద్యార్థులతో పాటు ఆందోళనలో పాల్గొన్నాయి. ఆందోళన మరింత ఉధ్రుతం అవుతుండడంతో కళాశాలకు సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చింది.

తల్లితండ్రులతో జరిగిన సమావేశంలోను పెంచిన ఫీజులను చెల్లించేందుకు వారు ససేమిరా  అన్నారు. బోర్డు కమిటీ  శనివారం సాయంత్రం మరో మారు సమావేశ మైంది. పేద విద్యార్థులపై పడుతున్న ఫీజు భారాన్ని ఉపసంహరించుకుంటున్నట్టుగా అధ్యక్షుడు డాక్టర్‌ వి.మాలకొండారెడ్డి ప్రకటించారు. కన్వీనర్‌ కోటాలో ఏ    క్యాటగిరీ కింద సీట్లు పొందిన విద్యార్థులు  మాత్రం పూర్తి ఫీజును చెల్లించాలని పేర్కొన్నారు.  ఇదే కన్వీనర్‌కోటాలో చేరిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాలకు చెందిన విద్యార్థులపైన ఈ భారం పడదని, వారు చెల్లించాల్సిన ఫీజులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకుంటామన్నారు. ఇక మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లు పొందిన వారిలోను ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వారికి స్కాలర్‌షిప్‌లను అందజేస్తామని తెలిపారు. మిగతా ఎన్‌ఆర్‌ఐ కోటా వారి ఫీజులో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. దీంతో రెండో సంవత్సరం విద్యార్థులు సోమవారం నుంచి తరగతులకు హాజరుకావాలని, మొదటి సంవత్సరం విద్యార్థులు ఈనెల 21 నుంచి  ఉన్న సెమిస్టర్‌ పరీక్షలకు సిద్ధం కావాలని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.రవీందర్‌రెడ్డి  తెలిపారు.  

Advertisement
Advertisement