‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’లో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు నిర్మొహమాటంగా అభిప్రాయాలను వెల్లడించారు.
కాంగ్రెస్ కార్యాచరణ సదస్సులో పార్టీ పెద్దల తీరును తూర్పారబట్టిన శ్రేణులు
రంగారెడ్డి జిల్లా: ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’లో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు నిర్మొహమాటంగా అభిప్రాయాలను వెల్లడించారు. పది కీలకాంశాలపై చర్చకు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ బృందాలు ప్రత్యేకంగా నిర్వహించిన బేటీల్లో దాదాపు 1500 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు తమ సలహాలు, సూచనలు వెల్లడించారు. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరించి సోమవారం జరిగిన రెండోరోజు సదస్సులో వాటిని ప్రస్తావించారు.
కాంగ్రెస్కు చావు లేదు: జైపాల్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి చావులేదని కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అభివర్ణించారు. ‘ఫినిక్స్ పక్షి పూర్తిగా భస్మమయ్యాక కూడా బూడిదలోంచి పైకి లేస్తుంది. కాంగ్రెస్ కూడా ఫినిక్స్ లాంటిదే’ అని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో ఏ ఊరు వెళ్లినా కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతున్నారని పేర్కొన్నారు.
కఠినంగా వ్యవహరించాలి: డి.శ్రీనివాస్
పార్టీలో క్రమశిక్షణ కీలకాంశం. కాని దీనికి తగిన ప్రాధాన్యత లేకుండా పోయింది. పార్టీలో పనిచేస్తూ ఇతర పార్టీలకు సహకరిస్తున్నారు. దీంతో కిందిస్థాయి నేతల్లో చులకన భావం కలుగుతోంది. ఇకనైనా కఠినంగా వ్యవహరించాలి.
దళితుల్లో నమ్మకాన్ని కలిగించాలి: గీతారెడ్డి
దళితులకు పార్టీలో పాధాన్యత తగ్గుతోంది. గ్రామస్థాయి నుంచి పీసీసీ వరకు ఎస్సీ, ఎస్టీలకు పదవుల పంపిణీ జరగాలి. ఆర్థికంగా వెనకబడిన నాయకులకు అండగా నిలవాలి. గ్రామాలవారీగా పరిస్థితిని సమీక్షించేందుకు సమావేశాలు నిర్వహించాలి.
బీసీల బలాన్ని గమనించాలి : వీహెచ్
సీఎం కేసీఆర్ తలపెట్టిన సర్వేలో బీసీల స్థానమేంటో తెలిసిపోయింది. 60 శాతం ఉన్న బీసీలకు పదవుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. మండల, డీసీసీ పదవుల్లో కీలకభాగం ఈ వర్గానికివ్వాలి. బీసీ సబ్ప్లాన్ కోసం ఉద్యమాన్ని లేవనెత్తాలి.
మైనార్టీలకు అదనపు పదవులివ్వాలి: షబ్బీర్ అలీ
మైనార్టీ నాయకులను కేవలం ఆ వర్గానికి సంబంధించిన పదవులకే పరిమితం చేస్తున్నారు. దీంతో ప్రధాన విభాగాల్లో వీరి ప్రాధాన్యం బాగా తగ్గింది. అలా కాకుండా అన్ని విభాగాల్లో మైనార్టీలకు పదవులను ఇవ్వాలి.
మనకూ పేపర్, టీవీ కావాలి: సురేష్రెడ్డి
కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రచారం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాం. మన ఓటమికి ప్రధాన కారణమిదే. మన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటే మనకూ ఒక దినపత్రిక, టీవీ చానల్ అవసరం.