అతివకు అర్ధభాగం | 50 Percent Women Reservation In Panchayat Elections | Sakshi
Sakshi News home page

అతివకు అర్ధభాగం

Dec 31 2018 9:07 AM | Updated on Dec 31 2018 9:07 AM

50 Percent Women Reservation In Panchayat Elections - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: మహిళలు ఇంటికే పరిమితంకాకుండా రాజకీయాల్లో రాణించేలా ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించడంతో ఎన్నికలకు నారీమణులు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని ఆదిలాబాద్‌రూరల్, మావల, బేల, జైనథ్‌ మండలాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రిజర్వేషన్ల కోటా ప్రకటించడంతో పల్లెపోరు సిద్ధమైంది. దీంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రచారాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటినుంచే రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని తమ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల మద్దతును కూడగట్టుకుంటున్నట్లు సమాచారం. కాగా నూతన పంచాయతీరాజ్‌ చట్టం మహిళలకు పెద్దపీఠ వేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ కేటగిరిలో 50శాతం కోటాను మహిళలకు కేటాయించింది. మిగితా స్థానాల్లో కూడా పురుషులతో సమానంగా పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నియోజకవర్గంలో..
ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని మావల మండలంలో మూడు గ్రామపంచాయతీలు, ఆదిలాబాద్‌రూరల్‌ మండలంలో 34 జీపీలు, జైనథ్‌ మండలంలో 42, బేల మండలంలో 37 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామపంచాయతీల్లో యాభైశాతం మహిళలకు రిజర్వేషన్‌ చేయగా, మిగతా యాభైశాతం జనరల్‌స్థానాల్లో మహిళలు, పురుషులు పోటీలో ఉండనున్నారు.

అతివలకే సగం స్థానాలు
పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు సగం స్థానాలు దక్కడంతో నారీమణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం మహిళలపట్ల శ్రద్ధ కనబర్చి ఈ నిర్ణయాన్ని తీసుకుందని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. దీంతో రాజకీయంగా మహిళలు ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. మహిళలకు 50 శాతం స్థానాలు దక్కడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామాల్లోని మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పంచాయతీలో సర్పంచ్‌గా ఎన్నికయ్యేందుకు పలువురు మహిళలు ఆసక్తిచూపుతున్నారు. వచ్చేనెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికల అనంతరం ఆయా గ్రామపంచాయతీల్లో మహిళలే సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 50శాతం రిజర్వేషన్‌ ప్రకటించడం గతంలో సర్పంచ్‌గా పని చేసిన పలువురు మహిళా సర్పంచ్‌లు, మహిళా సంఘాల నాయకురాళ్లు, మహిళా ఉద్యోగులు పట్ల హర్షం వ్యక్తంచేస్తున్నారు.

ఖరారైన జైనథ్‌ సర్పంచు రిజర్వేషన్లు
జైనథ్‌: మండలంలోని 29పాత, 13 కొత్త గ్రామ పంచాయతీలు కలిపి మొత్తం 42 సర్పంచ్‌ స్థానాలకు రిజర్వేషన్లు శనివారం రాత్రి ఖరారయ్యాయి.  
జనరల్‌ : మాంగుర్ల, పిప్పర్‌వాడ, పూసాయి, కామాయి, దీపాయిగూడ, కంఠ, సాంగ్వి(కే), రాంపూర్‌(టి), బెల్గాం.
జనరల్‌ మహిళ: పెండల్‌వాడ, మాండగాడ, ఆకోలి, బహదూర్‌పూర్, పిప్పల్‌గావ్, ఖాప్రి, కరంజి, కూర, భోరజ్, మాకోడ.
బీసీ జనరల్‌ : బాలాపూర్, హషీంపూర్, గిమ్మ(కే), అడ, కౌఠ, సిర్సన్న.
బీసీ మహిళ : లేకర్‌వాడ, సావాపూర్, ఆకుర్ల, నిరాల, తరోడ, కోర్ట.
ఎస్సీ జనరల్‌ : గూడ, జైనథ్‌.
ఎస్సీ మహిళ : పార్డి(కే), లక్ష్మీపూర్‌.
ఎస్టీ జనరల్‌ : కాన్ప మేడిగూడ(సి), పార్డి(బి), సుందరగిరి, మార్గూడ.
ఎస్టీ మహిళ : కాన్పమేడిగూడ(ఆర్‌), జామ్ని, బెల్లూరి. 42 పంచాయతీలకు 19 స్థానాలు జనరల్‌కు, 12  స్థానాలు బీసీలకు, నాలుగు స్థానా లు ఎస్సీలకు, ఏడు స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. దీంట్లో 50శాతం స్థానాలు(21 జీపీలు) మహిళలకు కేటాయించారు.

50శాతం రిజర్వేషన్‌ హర్షణీయం
ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో మహిళలకోసం అమలు చేస్తున్న 50శాతం రిజర్వేషన్‌ హర్షించదగిన విషయం. ఇదే సమయంలో గ్రా మాల్లో సర్పంచ్‌ అభ్యర్థులుగా గెలుపొందే మహిళలను వారి కుటుంబ సభ్యులు రాజకీయంగా ప్రోత్సహించాలి. ప్రభుత్వం మహిళల ప్రాముఖ్యతను గుర్తించి రాజకీయంగా రిజర్వేషన్‌ వర్తింపజేస్తుంది. రాజకీయంగానే కాకుం డా కుటుంబ సభ్యులు అన్నిరంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాలి.
– ఏదుల్లా శోభ, బట్టిసావర్గాం 

Advertisement
 
Advertisement
Advertisement