ఇత్తడిని పుత్తడి చేసి.. | two arrested in jagtial district | Sakshi
Sakshi News home page

ఇత్తడిని పుత్తడి చేసి..

Dec 22 2016 12:27 PM | Updated on Aug 25 2018 6:21 PM

ఇత్తడిపై బంగారం పూత పూసి విక్రయించిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది.

 
నకిలీ బంగారం, ఇద్దరి అరెస్టు, జగిత్యాల
జగిత్యాల : ఇత్తడిపై బంగారం పూత పూసి విక్రయించిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. వివరాలు.. జగిత్యాల పట్టణంలో నివసిస్తున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి గత నెల 10వ తేదీన కర్ణాటకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేశారు. కిలో బంగారాన్ని రూ. 3 లక్షలకే ఇస్తామని, ఆ బంగారం తమ ఇంటిని కూల్చివేస్తున్నపుడు జరిపిన తవ్వకాల్లో దొరికిందని తెలిపారు. వెంకటేశ్వరరావును నమ్మించడానికి మొదటగా నిజమైన బంగారు కాయిన్‌(1 గ్రాము)ను చూయించారు. అది చూసి తెలిసిన వాళ్ల దగ్గర బంగారాన్ని టెస్ట్ చేయించాడు. అసలు బంగారమే అని నిర్ధరణ చేసుకున్నాక వాళ్లను మళ్లీ సంప్రదించాడు. వారు డిసెంబర్ 10న పావు కిలో నకిలీ బంగారాన్ని అందించి రూ. 3 లక్షల నగదు పట్టుకెళ్లారు.
 
బంగారం షాపు వద్దకు తీసుకెళితే అది నకిలీదని తేలడంతో తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరో పావు కిలో బంగారం కావాలని బాధితుడి చేత నిందితులకు ఫోన్ చేయించారు. నిందితులు నకిలీ బంగారంతో మళ్లీ నిన్న(బుధవారం) జగిత్యాలకు రావడంతో పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారు కర్ణాటకలోని బళ్లారి జిల్లా బత్తలపల్లికి చెందిన కావడి రవిచంద్ర, కావడి శ్రీకాంత్‌గా గుర్తించారు. వారి నుంచి రూ. 2.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ అనంత శర్మ విలేకరుల సమావేశం పెట్టి వివరాలు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement