ఇక బీఎంసీ ఆస్పత్రుల్లో పోస్ట్‌మార్టం | post mortem in bmc hospital | Sakshi
Sakshi News home page

ఇక బీఎంసీ ఆస్పత్రుల్లో పోస్ట్‌మార్టం

Feb 6 2015 11:59 PM | Updated on Apr 3 2019 4:53 PM

మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఆస్పత్రుల్లో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు అనుమతినివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 సాక్షి, ముంబై: మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఆస్పత్రుల్లో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు అనుమతినివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకవేళ రోగీ చనిపోతే పోస్టుమార్టం కోసం ఇతర ఆస్పత్రుల చుట్టు తిరగాల్సిన పని లేదు. అదే ఆస్పత్రిలో పోస్టుమార్టం పనులు పూర్తి చేసి శవాన్ని బంధువులకు అప్పగించనున్నారు. దీంతో ఇటు మృతుని బంధువులు, అటు విధినిర్వహణలో ఉన్న పోలీసుల శ్రమ పూర్తిగా తగ్గనుంది.

బీఎంసీతోపాటు ఇతర కార్పొరేషన్లు, అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టుమార్టం చేసే సౌకర్యం లేదు. కొన్ని అస్పత్రుల్లో ఈ సౌకర్యం ఉన్నప్పటికీ అనేక సందర్భాలలో సమయాభావం, సిబ్బంది కొరత వల్ల అక్కడ శవాలు క్యూలో ఉంటాయి. దీంతో వైద్యులకు పని భారం ఎక్కువై మరసటి రోజు శవ పరీక్ష చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

చాలా వరకు ఆస్పత్రుల్లో శవ పరీక్ష పనులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే జరుగుతాయి. దీంతో మృతుల బంధువులు గంటలకొద్దీ ఆస్పత్రుల్లో పడిగాపులు పడాల్సి ఉంటుంది. హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు జరిగితే ఇదే పరిస్థితి పోలీసులకు కూడా ఎదురైతుంది. బీఎంసీ ఆస్పత్రుల్లో శవ పరీక్ష నిర్వహించేందుకు సంబంధించిన సర్క్యులర్ రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement