లైఫ్‌లైన్ @161 | indian railway completed 161 years | Sakshi
Sakshi News home page

లైఫ్‌లైన్ @161

Apr 16 2014 2:24 AM | Updated on Sep 2 2017 6:04 AM

భారతదేశం అభివృద్ధి సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఇండియన్ రైళ్ల సేవలకు 161 సంవత్సరాలు పూర్తిఅయ్యాయి.

సాక్షి , ముంబై: భారతదేశం అభివృద్ధి సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఇండియన్ రైళ్ల సేవలకు  161 సంవత్సరాలు పూర్తిఅయ్యాయి. మనదేశంలో మొట్టమొదటి రైలు 1853 ఏప్రిల్ 16వ తేదీ ముంబై బోరిబందర్ (సిఎస్‌టి) నుంచి ఠాణే వరకు పరుగెత్తింది. 1843లో ైసైన్-భాండూప్‌ను కలిపే రోడ్డుపై నుంచి వెళుతున్న బ్రిటిష్ ఇంజినీర్ జార్జ్ క్లార్క్‌కు వచ్చిన ఆలోచన నేడు దేశంలో రైల్వే వ్యవస్థ వేళ్లూనుకోవడానికి పునాదిగా చెప్పవచ్చు. ఇదిలా ఉండగా దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై అభివృద్ధిలో రైల్వే కీలకపాత్ర పోషించింది. అందుకే ఇక్కడి రైల్వే సేవలను ‘ముంబై లైఫ్‌లైన్’గా పేర్కొంటారు.

 స్థానిక ప్రజల ఉరుకుల పరుగుల జీవన విధానానికి అనుగుణంగా రైల్వే తన సేవలను విస్తరించింది. మూడు నుంచి ఐదు నిమిషాలతో తేడాతో నడిచే ఈ లోకల్ రైళ్లలో ప్రతిరోజూ సుమారు 65 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. నగరంలో సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్లున్నాయి. సెంట్రల్ రైల్వే పరిధిలో మైన్ (ప్రధాన), హార్బర్, వెస్టర్న్‌రైల్వే పరిధిలో వెస్టర్న్ సబర్బన్ లోకల్ ఇలా మూడు మార్గాల్లో లోకల్ రైళ్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన ప్రాంతాలు లోకల్ రైల్వేస్టేషన్లను ఆనుకుని అభివృద్ధి చెందాయని చెప్పవచ్చు.  

 వివరాలిలా..
 1853 తర్వాత  లోకల్ రైళ్ల వ్యవస్థ ప్రారంభమైంది. 1856లో మొట్టమొదటి రైల్వే టైంటేబుల్ రూపొందించారు. 1874లో సైన్ రైల్వేస్టేషన్ నిర్మాణం, 1880లో ముంబై-కళ్యాణ్ మధ్య రైల్వే సేవల ప్రారంభమయ్యాయి. దేశంలోనే చారిత్రాత్మక కట్టడాల్లో ఒకటైన నాటి విక్టోరియా టర్మినస్ (బోరిబందర్) నేటి ఛత్రపతి శివాజీ టర్మినస్ 1889లో పూర్తయ్యింది. 1890లో డోంబివలి రైల్వేస్టేషన్ కట్టారు. అనంతరం 1929లో ముంబై-కళ్యాణ్‌ల మధ్య మార్గాన్ని విద్యుద్దీకరణ చేశారు. ప్రారంభంలో ముంబైవాసులు రైళ్లను ‘బకరా గాడీ’ అనే పిలిచేవారు.  

 లోకల్ రైళ్ల తీరు...
 లోకల్ రైళ్లు మొదట తొమ్మిది బోగీలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 15 బోగీలతో నడుస్తున్నాయి. ఒక బోగీ సామర్థ్యం 200 మంది కాగా రద్దీ సమయాల్లో 500 మందికిపైగా ప్రయాణిస్తున్నారు. సెంట్రల్ రైల్వే పరిధిలోని మెయిన్ మార్గంలో సీఎస్‌టీ నుంచి కసారా (120 కిలోమీటర్లు), కోపోలి (112 కిలోమీటర్లు) వరకు లోకల్ రైలు సేవలుండగా హార్బర్ మార్గంలో సీఎస్‌టీ నుంచి పన్వెల్ (50 కిలోమీటర్లు) వరకు లోకల్‌రైళ్లు నడుస్తున్నాయి.

 అదేవిధంగా ఇటీవలే హార్బర్ పరిధిలో ఠాణే నుంచి వాషీ వరకు రైలు సేవలు ప్రారంభమయ్యాయి. సెంట్రల్ రైల్వే మెయిన్ హార్బర్ మార్గాల్లో ప్రతిరోజూ సుమారు 35 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వెస్టర్న్ రైల్వే పరిధిలో చర్చిగేట్ నుంచి విరార్ వరకు లోకల్ రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. చర్చిగేట్ నుంచి విరార్ రైల్వేస్టేషన్ల మధ్య మొత్తం 28 రైల్వే స్టేషన్లుండగా వీటిలో చర్చిగేట్, ముంబై సెంట్రల్, దాదర్, బాంద్రా, అంధేరీ, బోరివలి తదితర రైల్వే స్టేషన్లు ప్రధానమైనవిగా పేర్కొనవచ్చు. 

Advertisement
 
Advertisement
Advertisement