ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉండబోదన్న వార్తల్లో ....
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి
బెంగళూరు: ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉండబోదన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు, కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రి వర్గ విస్తరణను చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారమిక్కడి ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు జిల్లా, తాలూకా పంచాయితీ ఎన్నికలు వరుసగా రావడంతో మంత్రి వర్గ విస్తరణను చేపట్టలేక పోయామని అన్నారు.
ప్రస్తుతం అన్ని ఎన్నికలు పూర్తై నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రి వర్గ విస్తరణను చేపట్టనున్నట్లు వెల్లడించారు. మంత్రి వర్గ విస్తరణకు ముందు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు పార్టీ పెద్దలను కలిసి చర్చిస్తానని, ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణను చేపడతామని తెలిపారు.