Sakshi News home page

బీజేపీ వెనకడుగు..!

Published Tue, Sep 16 2014 10:44 PM

bjp not form govt new delhi Government arrangement

 న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం వేచిచూసే ధోరణిని అవలంబిస్తోంది. ఎంతమాత్రం తొందరపాటు ధోరణిని కనబరచడం లేదు. ఇందుకు కారణం ఢిల్లీ విధానసభలో తగినంత సంఖ్యాబలం లేకపోవడం, మంగళవారం వెలువడిన ఉప ఎన్నికల్లో వచ్చిన నిరాశాపూరిత ఫలితాలు తదితరాలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై అధిష్టాన పెద్దల్లో ఉత్సాహం కొరవడిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎంతమాత్రం ఆసక్తి కనబరచడం లేదు.
 
 కాగా ఢిల్లీ శాసనసభ  సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు.అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేం దుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు.
 
 ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజుల పాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి.
 

Advertisement
Advertisement