అదే జట్టుతో టీమిండియా.. | Unchanged India for Fifth Odi Against West Indies | Sakshi
Sakshi News home page

అదే జట్టుతో టీమిండియా..

Nov 1 2018 1:20 PM | Updated on Nov 1 2018 1:22 PM

Unchanged India for Fifth Odi Against West Indies - Sakshi

తిరువనంతపురం: టీమిండియాతో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపింది. గత వన్డేలో భారీ విజయం సాధించి ఊపు మీద ఉన్న టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతుండగా, వెస్టిండీస్‌ సిరీస్‌ను సమం చేయాలనే యోచనలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమవ్వగా, విండీస్‌ మాత్రం రెండు మార‍్పులు చేసింది. గాయం కారణంగా మొత్తం పర్యటనకే దూరమైన ఆశ్లే నర్స్‌ స్థానంలో దేవెంద్ర బిషూ తుది జట్టులోకి రాగా, హెమ్రాజ్‌ స్థానంలో ఒషేన్‌ థామస్‌ను జట్టులోకి తీసుకున్నారు.

బ్యాటింగ్‌ను పటిష్ట పర్చుకుని, బౌలింగ్‌లో వైవిధ్యంతో ముంబై వన్డేలో దిగిన టీమిండియా ఘన విజయం సాధించింది.  కాగా, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ప్రారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం, మాజీ కెప్టెన్‌ ధోని తనదైన ఇన్నింగ్స్‌ ఆడలేకపోవడం జట్టును కలవర పరుస్తోంది. రెండు శతకాలతో రోహిత్‌శర్మ, మూడు సెంచరీలతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అద్భుత ఫామ్‌లో ఉండగా, అర్ధ శతకం, శతకంతో నాలుగో స్థానానికి నిఖార్సైన బ్యాట్స్‌మన్‌నని అంబటి తిరుపతి రాయుడు చాటుకున్నాడు. కేదార్‌ జాదవ్, రవీంద్ర జడేజా బ్యాటింగ్‌ ఆర్డర్‌ లోతును పెంచారు. ప్రారంభంలో పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలను ఎదుర్కొనడం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడం భారత్‌కు కలిసొచ‍్చే అంశం. ఈ సిరీస్‌లో అంచనాలు మించి రాణించిన విండిస్‌ను తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా ఆడితేనే విరాట్ సేన సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.

తుది జట్లు

భారత్‌: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌ , అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోని, కేదర్‌ జాదవ్‌, జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, బూమ్రా

వెస్టిండీస్‌: జాసన్‌ హోల్డర్(కెప్టెన్‌), కీరన్‌ పావెల్‌, సాయ్‌ హోప్‌, మార్లోన్‌ శామ్యూల్స్‌, హెట్‌మెయిర్‌, రోవ్‌మాన్‌ పావెల్‌, ఫాబియన్‌ అలెన్‌, బిషూ, కీమో పాల్‌, రోచ్‌, థామస్‌

Advertisement
 
Advertisement
Advertisement