హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా సోమవారం రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్-రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఘోర తప్పిదం చోటు చేసుకుంది. అంపైర్ తప్పిదంతో రాజస్తాన్ రాయల్స్ పేసర్ బెన్ లాగ్లిన్ ఓవర్లో ఏడు బంతులు వేశాడు. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో భాగంగా 12వ ఓవర్లో బెన్ లాగ్లిన్ ఏడు బంతులు వేసినప్పటికీ ఎవరూ గమనించలేదు.
సాధారణంగా నో బాల్స్, వైడ్స్ వేసినప్పుడు మాత్రమే ఎక్కువ అదనపు బంతులు విసరడం చూస్తూ ఉంటాం. అధికారికంగా మాత్రం వాటిని మినహాయించి ఓవర్లో ఆరు బంతులు మాత్రమే వేయాల్సి ఉంటుంది. అయితే వాటికి ఆస్కారం లేకుండానే అంపైర్ ఏడు స్ట్రైట్ బంతుల్ని వేయడానికి అవకాశమిచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై తాజాగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నిజానికి ఏడు బంతులు వేయడం పెద్ద నేరమని క్రీడా పండితులు చెబుతున్నారు. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు మరో 25 బంతులు మిగిలి ఉండగా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఈ విషయం మరుగున పడింది. ఒకవేళ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగితే మాత్రం దీనిపై పెను దుమారమే చెలరేగేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓవరాల్గా ఇది అతి పెద్ద తప్పిదంగా వారు అభిప్రాయపడుతున్నారు.