మాజీ ప్రేమికులు విభేదాలను పక్కనబెట్టి.. | Sakshi
Sakshi News home page

మాజీ ప్రేమికులు విభేదాలను పక్కనబెట్టి..

Published Tue, Apr 11 2017 7:08 PM

మాజీ ప్రేమికులు విభేదాలను పక్కనబెట్టి..

ముంబై: మాజీ ప్రేమికులు బాలీవుడ్ భామ ప్రీతి జింటా, వ్యాపారవేత్త నెస్ వాడియాలు గతంలో ఏర్పడ్డ విభేదాలను పక్కనపెట్టారు. ప్రేమ, వివాదాలను మరచిపోయి ఐపీఎల్ జట్టు కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు భాగస్వాములుగా కలసి పనిచేయనున్నారు. గతంలో పరస్పరం తీవ్ర ఆరోపణలు, దూషణలు చేసుకుని కేసుల వరకు వెళ్లిన ప్రీతి, వాడియా..  తాజా ఐపీఎల్ సీజన్‌లో ముచ్చటించుకుంటూ కనిపించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించిన సందర్భంగా ఇద్దరూ తమ జట్టు క్రికెటర్లతో కలసి సెలబ్రేట్ చేసుకున్నారు.

ప్రీతి, వాడియా గతంలో దాదాపు 10 ఏళ్లు డేటింగ్ చేశారు. వ్యాపార భాగస్వాములుగా మారి 2008లో ఐపీఎల్ జట్టు పంజాబ్ సహ యజమానులయ్యారు. కాగా ఆ మరుసటి ఏడాది నుంచి ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఓ పార్టీలో ప్రీతిని వాడియా చెంపదెబ్బ కొట్టినట్టు వార్తలు వచ్చాయి. ఇక 2014లో ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. వాడియా తనను దూషించి, లైంగికంగా వేధించాడని ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆయన ఈ ఆరోపణలను ఖండించారు. ఆ తర్వాత ఇద్దరూ పూర్తిగా దూరమయ్యారు. గతేడాది ప్రీతి వ్యాపారవేత్త గుడెనఫ్‌ను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రీతి, వాడియా గతాన్ని మరిచి వ్యాపార భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. 

Advertisement
Advertisement