ఆసీస్ జట్టులో పాక్ క్రికెటర్ !
సిడ్నీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ ఖదీర్ తనయుడు ఉస్మాన్ ఖదీర్ ఆస్ట్రేలియా జట్టు తరపున బరిలోకి దిగాడు. బుధవారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన వార్మప్ వన్డే మ్యాచ్లో పీఎం-11 జట్టు తరపున తొలిసారి ఆసీస్ జెర్సీ ధరించాడు. తన తండ్రిలానే లెగ్స్పిన్తో అదరగొట్టి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పూర్తి స్థాయి ఆసీస్ జట్టు తరపున ఆడాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటికే ఆదిశగా కసరత్తులు మొదలు పెట్టిన ఈ యువ క్రికెటర్.. త్వరలో ఆ జట్టులో భాగమవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే పాకిస్తాన్లో సరైన అవకాశాలు లభించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ప్రస్తుతం టెంపరరీ వీసాతో ఆసీస్ దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న ఉస్మాన్.. త్వరలోనే పౌరసత్వం పొంది ఆ దేశం తరపున ఆడుతానని తెలిపాడు. 2020 టీ20 ప్రపంచకప్ వరకు జట్టులో ఉండటమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చాడు. అంతకు ముందే తనకు వన్డే, టెస్టుల్లో అవకాశం లభిస్తే ఇంకా మంచిదని అభిప్రాయపడ్డాడు. (చదవండి: ధోని భాయ్ అది పక్కా ఔట్! )
ఈ నిర్ణయాన్ని తన తండ్రి ఖదీర్ అంత సులువుగా ఒప్పుకోలేదన్నాడు. ‘కొన్నేళ్ల క్రితం నా తండ్రితో నేను ఆస్ట్రేలియా తరపున ఆడాలనుకుంటున్నానని చెప్పాను. దీనికి ఆయన కుదురదు.. పాకిస్తాన్ తరుపునే ఆడాలని ఆదేశించాడు. కానీ నాకు పాక్ తరపున ఆడే అవకాశం అంతగా రాలేదు. జట్టులో ఎంపికైనప్పటికీ బెంచ్కే పరిమితమయ్యాను. ఆసీస్కు వచ్చాకే నాకు అవకాశాలు దక్కాయి. దీంతో మా నాన్న కూడా ఒప్పుకున్నారు. నా దీవెనెలు నీకు ఎప్పుడుంటాయి. నీకేం కావాలో నీవు అది చేయగలవన్నారు.’ అని ఉస్మాన్ చెప్పుకొచ్చాడు. ఇక పాక్ క్రికెటర్ ఆసీస్ తరపున ఆడటం ఇదే తొలిసారి కాదు. ఫవాద్ అహ్మద్ 2013లో ఆసీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు అదే బాటలో ఉస్మాన్ నడుస్తున్నాడు. (చదవండి: ముగింపు అదిరింది)