మరో హోరాహోరీ | Mumbai all set to Master rivals | Sakshi
Sakshi News home page

మరో హోరాహోరీ

Aug 16 2013 1:40 AM | Updated on Sep 1 2017 9:51 PM

ఐబీఎల్‌లో గురువారం సాయంత్రం జరిగిన పోటీలో బంగా బీట్స్, ముంబై మాస్టర్ జట్టు సమంగా నిలిచాయి. ఈ పోటీలో నాలుగు మ్యాచ్‌లు ముగిసే సరికి ఇరు జట్లు చెరో రెండు నెగ్గి 2-2తో సమంగా నిలిచాయి.

న్యూఢిల్లీ: ఐబీఎల్‌లో గురువారం సాయంత్రం జరిగిన పోటీలో బంగా బీట్స్, ముంబై మాస్టర్ జట్టు సమంగా నిలిచాయి. ఈ పోటీలో నాలుగు మ్యాచ్‌లు ముగిసే సరికి ఇరు జట్లు చెరో రెండు నెగ్గి 2-2తో సమంగా నిలిచాయి. పురుషుల సింగిల్స్‌లో ముంబై రెండు మ్యాచ్‌లూ నెగ్గగా, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.  ముంబై మాస్టర్స్ స్టార్ ఆటగాడు, వరల్డ్ నంబర్‌వన్ లీ చోంగ్ వీ తొలి మ్యాచ్ సమయానికి భారత్‌కు చేరుకోలేదు. తర్వాతి మ్యాచ్‌కు తను అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
 
 తొలి సింగిల్స్ మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ అనూహ్యంగా పరాజయం పాలయ్యాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న కశ్యప్... 41వ ర్యాంక్ ప్లేయర్ వ్లదీమర్ ఇవనోవ్‌కు తలవంచాడు. ముంబై మాస్టర్స్ ఆటగాడు ఇవనోవ్ వరుస గేమ్‌లలో 21-18, 21-18 స్కోరుతో కశ్యప్‌ను చిత్తు చేశాడు. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో తై జు యింగ్ నెగ్గి బంగా బీట్స్‌ను మొదటి విజయాన్ని అందించింది.
 
 జు యింగ్ 21-17, 21-18తో వెటరన్ షట్లర్ టిన్ బాన్‌ను ఓడించింది. పురుషుల డబుల్స్‌లోనూ బెంగళూరుదే పైచేయి అయింది. కార్ల్‌సన్ మాగ్నసన్-అక్షయ్ దివాల్కర్ జోడి 21-13, 21-12తో ముంబై జంట ప్రణవ్ చోప్రా-మను అత్రిలపై విజయం సాధించింది. ఆ తర్వాత పురుషుల రెండో సింగిల్స్ మ్యాచ్‌లో కూడా హోరాహోరీ పోరు సాగింది. చివరకు ముంబై ఆటగాడు వెబ్లర్ 17-21, 21-17, 11-6తో బంగా ప్లేయర్ హు యున్‌పై గెలుపొందాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement