కోహ్లి వచ్చేస్తున్నాడు స్మిత్‌.. | Sakshi
Sakshi News home page

కోహ్లి వచ్చేస్తున్నాడు స్మిత్‌..

Published Tue, Nov 26 2019 4:52 PM

Kohli Cuts Down Smith's Lead  After Pink Ball Test hundred - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విడుదల చేసిన ఆటగాళ్ల తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండో స్థానాన్ని కాపాడుకోవడమే కాకుండా టాప్‌కు చేరువగా వచ్చాడు. ప్రస్తుతం విరాట్‌ కోహ్లి 928 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక్కడ టాప్‌ ర్యాంక్‌లో ఉన్న ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు అత్యంత సమీపంగా వచ్చాడు.  స్టీవ్‌ స్మిత్‌ 931 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో కోహ్లి సెంచరీ సాధించడంతో తన పాయింట్లను మరింత పెంచుకున్నాడు. అంతకుముందు వరకూ స్మిత్‌కు కోహ్లికి 25 పాయింట్లు తేడా ఉండగా, దాన్ని మూడు పాయింట్ల వ్యత్యాసానికి తీసుకొచ్చాడు.

ఇక బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించిన మయాంక్‌ అగర్వాల్‌ ఒక పాయింట్‌ మెరుగుపరుచుకుని 10వ స్థానానికి వచ్చాడు. దాంతో టాప్‌-10లో నలుగురు భారత ఆటగాళ్లు చేరారు. కోహ్లి, చతేశ్వర పుజారా, అజింక్యా రహానే ఇప్పటికే టాప్‌-10 జాబితాలో ఉండగా ఇప్పుడు మయాంక్‌ చేరాడు.  ఇక బౌలర్ల ర్యాంకింగ్‌లో రవి చంద్రన్‌ అశ్విన్‌ ఒక స్థానం మెరుగుపరుచుకుని 9వ స్థానానికి చేరాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న బుమ్రా ఒక స్థానం దిగజారి ఐదో స్థానానికి పడిపోయాడు. ఇషాంత్‌శర్మ 17వ స్థానంలో, ఉమేశ్‌ యాదవ్‌ 21వ స్థానంలో ఉన్నారు. ఆల్‌ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా రెండో స్థానాన్ని నిలుపుకున్నాడు. 406 రేటింగ్‌ పాయింట్లతో జడేజా రెండో స్థానంలో కొనసాగుతుండగా, హోల్డర్‌ 472 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Advertisement
Advertisement