
అలీ ఆదుకున్నాడు
పరుగుల ఖాతా తెరకుండానే క్యాచ్ మిస్... రెండు సార్లు కూడా అనుకూలంగా వచ్చిన రివ్యూలు...
తొలి రోజు ఇంగ్లండ్ 284/4
మొయిన్ అలీ సెంచరీ రాణించిన రూట్
భారత్తో చివరి టెస్టు
పరుగుల ఖాతా తెరకుండానే క్యాచ్ మిస్... రెండు సార్లు కూడా అనుకూలంగా వచ్చిన రివ్యూలు... మొయిన్ అలీ ఆటకు అదృష్టం కూడా కలిసొచ్చింది. తొలి బౌండరీ కొట్టేందుకు 49 బంతులు తీసుకున్నా, ఆ తర్వాత నిలదొక్కుకొని ఎదురుదాడికి దిగిన అతను కెరీర్లో ఐదో సెంచరీతో ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. మరోవైపు భారత్పై అద్భుత రికార్డును కొనసాగిస్తూ జో రూట్ కీలక ఇన్నింగ్స్ ఆడి అలీకి అండగా నిలిచాడు. 21/2 స్కోరుతో జట్టు క్లిష్ట స్థితిలో ఉన్న సమయంలో జత కలిసిన వీరిద్దరి భారీ భాగస్వామ్యం కారణంగా చెపాక్లో తొలి రోజును ఇంగ్లండ్ సంతృప్తిగా ముగించింది. మూడు వికెట్లతో జడేజా ముందు నిలవగా, అరుదైన రీతిలో అశ్విన్కు ఒక్క వికెట్టూ దక్కలేదు. అయితే ముంబైలో కూడా మొదటి రోజు దాదాపు ఇన్నే పరుగులు చేసిన ఇంగ్లండ్, ఈ సారైనా మరింత భారీ స్కోరు సాధించి సురక్షిత స్థితికి చేరుతుందా అనేది చూడాలి.
చెన్నై: టెస్టు సిరీస్ను ఇప్పటికే కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుకు పరువు కాపాడుకునే ప్రయత్నంలో చివరి మ్యాచ్లో చెప్పుకోదగ్గ ఆరంభం లభించింది. నెమ్మదైన పిచ్పై జాగ్రత్తగా, ఒత్తిడి లేకుండా ఆడిన ఆ జట్టు మొదటి రోజు మెరుగైన ఆటను ప్రదర్శించింది. భారత్తో ప్రారంభమైన ఐదో టెస్టులో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మొయిన్ అలీ (222 బంతుల్లో 120 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించగా, జో రూట్ (144 బంతుల్లో 88; 10 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్కు 146 పరుగులు జోడించారు. ఆ తర్వాత జానీ బెయిర్స్టో (90 బంతుల్లో 49; 3 సిక్సర్లు)తో కలిసి అలీ నాలుగో వికెట్కు 86 పరుగులు జత చేశాడు. ప్రస్తుతం క్రీజ్లో అలీతో పాటు స్టోక్స్ (5 బ్యాటింగ్) ఉన్నాడు.
కోహ్లి ఇచ్చిన 5 పరుగులు
ఇటీవలే న్యూజిలాండ్తో ఇండోర్లో జరిగిన టెస్టులో జడేజా పిచ్పై పరుగెత్తిన కారణంగా భారత్కు ఐదు పెనాల్టీ పరుగుల శిక్ష వేయడం గుర్తుందా... ఇప్పుడు కూడా భారత్ మరోసారి పెనాల్టీగా ఐదు పరుగులను ప్రత్యర్థికి అందించింది. అయితే ఈసారి కెప్టెన్ కోహ్లి వంతు! ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 25వ ఓవర్లో అశ్విన్ వేసిన బంతి రూట్ బ్యాట్కు తగిలి ఫైన్లెగ్ దిశగా వెళ్లింది. స్లిప్స్ నుంచి పరుగెత్తుకు వెళ్లి బంతిని ఆపిన కోహ్లి, దానిని కీపర్ పార్థివ్ వైపు విసిరాడు. అయితే పార్థివ్ దానిని అందుకునే ముందే అక్కడ పెట్టి ఉన్న హెల్మెట్కు బంతి తగిలింది. ఫీల్డింగ్ జట్టు ఉపకరణం బంతిని అడ్డుకున్న కారణంగా నిబంధనల ప్రకారం అంపైర్లు ఐదు పెనాల్టీ పరుగులు ఇంగ్లండ్ స్కోరులో చేర్చారు. తాను విసిరిన త్రో దిశ మార్చుకోవడాన్ని చూస్తూ కోహ్లి చిరునవ్వులు చిందించడం కనిపించింది!
10 టెస్టుల్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న పదో ఆటగాడు కుక్. మిగతావారందరికంటే చిన్న వయసులో (31 ఏళ్ల 357 రోజులు), అతి తక్కువ సమయంలో (10 ఏళ్ల 290 రోజులు) అతను ఈ ఘనత సాధించాడు.
11 భారత్పై ఆడిన 11 టెస్టుల్లో రూట్ 11 సార్లు కనీసం 50కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ 11 టెస్టుల్లోనూ ఏదో ఒక ఇన్నింగ్స్లో అతను కనీసం అర్ధ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్పై బ్రాడ్మన్ (14లో 14) తర్వాత రూట్దే ఈ ఘనత.
రివ్యూ కాని రివ్యూ
తొలి రోజు ఆటలో రూట్ అవుట్ మినహా మిగతా రివ్యూలన్నీ భారత్కు వ్యతిరేకంగానే వచ్చాయి. అయితే జడేజా వేసిన తొలి ఓవర్లో ఆసక్తికర సంఘటన జరిగింది. మూడో బంతి కుక్ ప్యాడ్లకు తగలడంతో జడేజా గట్టిగా అప్పీల్ చేయగా, ఎరాస్మస్ నాటౌట్గా ప్రకటించారు. దాంతో జడేజాతో తీవ్ర చర్చోపచర్చల అనంతరం కోహ్లి దానిని ‘రివ్యూ’ కోరాడు. అయితే అప్పటికే 15 సెకన్ల సమయం మించిపోయిందంటూ అంపైర్లు దానిని తిరస్కరించారు. కానీ తర్వాత చూసిన రీప్లేలో బంతి వికెట్లకు దూరంగా పోతున్నట్లు తేలింది. రివ్యూలో అది ఎలాగూ నాటౌట్గానే తేలేది. దాంతో ఆలస్యమే కలిసొచ్చినట్లయి ఒక రివ్యూ వృథా కాకుండా ఆగిపోయింది.
సెషన్–1: ఓపెనర్లు విఫలం
గత టెస్టులో సెంచరీ చేసిన జయంత్ కండరాల నొప్పితో బాధపడుతుండటంతో అతని స్థానంలో అమిత్ మిశ్రాకు అవకాశం కల్పించగా, భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మ జట్టులోకి వచ్చాడు. మరో వైపు ఇంగ్లండ్ జట్టులో బ్రాడ్ తిరిగి రాగా, లెఫ్టార్మ్ స్పిన్నర్ లియామ్ డాసన్ ఈ టెస్టుతో అరంగేట్రం చేశాడు. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే రెండు పరుగులు తీసి కుక్ టెస్టుల్లో 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే పిచ్పై ఉన్న తేమను ఉపయోగించుకున్న ఇషాంత్, ఇంగ్లండ్ను ఆరంభంలోనే దెబ్బ తీశాడు. అతని మూడో ఓవర్లో జెన్నింగ్స్ (1) వెనుదిరిగాడు. మరికొద్ది సేపటికే జడేజా బౌలింగ్లో కోహ్లి స్లిప్లో చక్కటి క్యాచ్ పట్టడంతో కుక్ (10) పెవిలియన్ చేరాడు. ఈ సిరీస్లో జడేజా బౌలింగ్లో ఐదోసారి కుక్ అవుట్ కావడం విశేషం. ఈ దశలో రూట్, అలీ కలిసి ఇంగ్లండ్ను ఆదుకున్నారు. రూట్ ధాటిగా ఆడగా, అలీ నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్నాడు. సున్నా వద్ద అలీ ఇచ్చిన క్యాచ్ను రాహుల్ వదిలేయడం ఆ జట్టుకు మేలు చేసింది. ఓవర్లు: 29, పరుగులు: 68, వికెట్లు: 2
సెషన్–2: భారీ భాగస్వామ్యం
లంచ్ తర్వాత రూట్, అలీ జోరును పెంచారు. అలీ కొన్ని చక్కటి షాట్లు ఆడగా, మరోవైపు జడేజా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన రూట్ 91 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు జడేజా బౌలింగ్లో అలీ అవుట్ కోసం ఎల్బీ అప్పీల్ అనంతరం భారత్ రివ్యూ చేసినా నిర్ణయం ప్రతికూలంగా వచ్చింది. బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఈ ఇద్దరూ చక్కటి సమన్వయంతో చకచకా పరుగులు జోడించారు. 111 బంతుల్లో అలీ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు జడేజా ఈ భాగస్వామ్యానికి తెర దించాడు. అతని బౌలింగ్లో స్వీప్ చేయబోయిన రూట్ కీపర్ పార్థివ్కు క్యాచ్ ఇచ్చాడు. అయితే అంపైర్ ఎరాస్మస్ నాటౌట్గా ప్రకటించిన తర్వాత తీవ్రంగా ఆలోచించి చివరకు కోహ్లి రివ్యూకు వెళ్లాడు. సుదీర్ఘ సమయం పాటు రీప్లేలు చూసిన అనంతరం ‘అల్ట్రా ఎడ్జ్’లో బంతి బ్యాట్ దిగువ భాగంలో తాకినట్లు గుర్తించిన థర్డ్ అంపైర్ రూట్ను అవుట్గా ఖరారు చేశాడు. దాంతో తీవ్ర అసంతృప్తితో అతను వెనుదిరిగాడు.
ఓవర్లు: 31, పరుగులు: 114, వికెట్లు: 1
సెషన్–3: అలీ శతకం
విరామం తర్వాత మరో కీలక భాగస్వామ్యంతో ఇంగ్లండ్ మెరుగైన స్థితికి చేరింది. ఈ సెషన్లో అలీకి బెయిర్స్టో అండగా నిలిచాడు. అశ్విన్, జడేజా వేసిన వరుస ఓవర్లలో ఒక్కో సిక్సర్ బాది బెయిర్స్టో దూకుడు ప్రదర్శించాడు. మిశ్రా బౌలింగ్లో అలీ అవుట్ కోసం చేసిన మరో రివ్యూ కూడా వృథా అయింది. అయితే బెయిర్స్టో నిర్లక్ష్యంగా ఆడిన షాట్ భారత్కు ఈ సెషన్లో వికెట్ అందించింది. జడేజా బౌలింగ్లో డ్రైవ్ చేయబోయిన అతను, కవర్స్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం మిశ్రా బౌలింగ్లో పాయింట్ దిశగా సింగిల్ తీసి అలీ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 86వ ఓవర్లో భారత్ కొత్త బంతిని తీసుకున్న వెంటనే ఇషాంత్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అలీ, స్టోక్స్తో కలిసి ప్రమాదం లేకుండా రోజును ముగించాడు. ఓవర్లు: 30, పరుగులు: 102, వికెట్లు: 1