టీమిండియా ‘డబుల్‌ సూపర్‌’ | IND Vs NZ: Team India Clinch Another Super Over Thriller | Sakshi
Sakshi News home page

టీమిండియా ‘డబుల్‌ సూపర్‌’

Jan 31 2020 4:56 PM | Updated on Jan 31 2020 5:20 PM

IND Vs NZ: Team India Clinch Another Super Over Thriller - Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో టీ20లో టీమిండియా మరో చిరస్మరణీయమైన విజయాన్ని సాధించింది. అచ్చం మూడో టీ20ని తలపించే విధంగా సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో టీమిండియా ఇంకా బంతి ఉండగానే గెలుపును అందుకుంది. సూపర్‌ ఓవర్‌లో న్యూజిలాండ్‌ 14 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, దాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. న్యూజిలాండ్‌ సూపర్‌ ఓవర్‌ను సీఫెర్ట్‌-మున్రోలు ఆరంభించారు. కాగా, టీమిండియా ఓవర్‌ను బమ్రా అందుకున్నాడు. తొలి బంతికి సీఫెర్ట్‌ రెండు పరుగులు తీయగా, రెండో బంతికి ఫోర్‌ కొట్టాడు. మూడో బంతికి సీఫెర్ట్‌ రెండు పరుగులు తీయగా, నాల్గో బంతికి ఔటయ్యాడు. ఐదో బంతికి మున్రో ఫోర్‌ కొట్టగా, ఆరో బంతికి సింగిల్‌ తీశాడు.(ఇక్కడ చదవండి: కోహ్లి మెరుపు ఫీల్డింగ్‌.. మున్రో బ్యాడ్‌ లక్‌)

దాంతో  కివీస్‌ సూపర్‌ ఓవర్‌ 13 పరుగులు చేసింది. ఆపై 14 పరుగుల టార్గెట్‌తో దిగిన టీమిండియా బంతి ఉండగా విజయం సాధించింది. భారత్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లిలు ఆరంభించారు. తొలి బంతికి సిక్స్‌కొట్టిన రాహుల్‌.. రెండో బంతికి ఫోర్‌ కొట్టాడు. మూడో బంతికి రాహుల్‌ ఔట్‌ కాగా, సంజూ శాంసన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. నాల్గో బంతికి కోహ్లి రెండు పరుగులు తీయగా, ఐదో బంతికి ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు.

ముందుగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ టైగా ముగిసింది.  మూడో టీ20ని మరిపిస్తూ నాల్గో టీ20 కూడా టైగా ముగియడంతో మ్యాచ్‌ మరొకసారి ఉత్కంఠ భరితంగా మారింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 165 పరుగులు చేయగా, న్యూజిలాండ్‌ కూడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 165 పరుగులే చేసింది. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన తరుణంలో కివీస్‌ పరుగు మాత్రమే చేసి సాన్‌ట్నార్‌ వికెట్‌ను కోల్పోయింది. దాంతో మ్యాచ్‌ టై అయ్యింది.  ఆఖరి ఓవర్‌లో కివీస్‌కు ఏడు పరుగులు అవసరం కాగా,  ఆరు పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ ఒత్తిడికి లోనుకావడంతో సూపర్‌ ఓవర్‌ వరకూ తీసుకొచ్చింది. చివరి ఓవర్‌ను శార్దూల్‌ ఠాకూర్‌ వేశాడు. తొలి బంతికి రాస్‌ టేలర్‌ భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు.(ఇక్కడ చదవండి: మనీష్‌ పాండే నిలబెట్టాడు..!)

శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌ చేరాడు. ఇక రెండో బంతికి డార్లీ మిచెల్‌ ఫోర్‌ కొట్టి కాస్త ఒత్తిడి తగ్గించాడు. మూడో బంతికి సీఫెర్ట్‌ రనౌట్‌ అయ్యాడు. మిచెల్‌ సింగిల్‌  కోసం యత్నించగా కీపర్‌ రాహుల్‌ సీఫెర్ట్‌ను రనౌట్‌ చేశాడు.. నాల్గో బంతికి సింగిల్‌ రాగా, ఐదో బంతికి మిచెల్‌ భారీ షాట్‌ ఆడే యత్నంలో ఔటయ్యాడు. ఆరో బంతిని సాన్‌ట్నార్‌ ఎదుర్కోగా రెండు పరుగులు తీసే యత్నం చేశాడు. బంతిని దగ్గరగా పెట్టి రెండు పరుగు తీయడంతో సాన్‌ట్నార్‌ను రాహుల్‌ రనౌట్‌ చేశాడు. దాంతో మ్యాచ్‌ టై అయ్యింది. దాంతో ముందుగా సూపర్‌ ఓవర్‌ ఆడిన కివీస్‌ వికెట్‌ కోల్పోయి 13 పరుగులు చేయగా, భారత్‌ వికెట్‌ కోల్పోయినా ఇంకా బంతి మిగిలి ఉండగా విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ 4-0 ఆధిక్యంలో నిలిచింది. చివరి టీ20 ఆదివారం జరుగనుంది. ఇక కివీస్‌ వన్డేల్లో  టీ20ల్లో కలుపుకుని ఇప్పటివరకూ 8 సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లు ఆడగా అందులో ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలు కావడం గమనార్హం. న్యూజిలాండ్‌ కోల్పోయిన సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌ల్లో ఆరు టీ20 మ్యాచ్‌లు ఉండగా,  ఒక వన్డే ఉంది. (ఇక్కడ చదవండి: శాంసన్‌ ఏందిది..?)

సూపర్‌ ఓవర్‌ సాగిందిలా..

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌
సీఫెర్ట్‌-మున్రోలు ఇన్నింగ్స్‌ ఆరంభించగా, బుమ్రా సూపర్‌ ఓవర్‌ వేశాడు..
తొలి బంతి(సీఫెర్ట్‌ -రెండు పరుగులు)
రెండో బంతి(సీఫెర్ట్‌- ఫోర్‌)
మూడో బంతి( సీఫెర్ట్‌- రెండు పరుగులు)
నాల్గో బంతి( సీఫెర్ట్‌ ఔట్‌)
ఐదో బంతి(మున్రో -ఫోర్‌)
ఆరో బంతి(మున్రో-1 పరుగు)

టీమిండియా ఇన్నింగ్స్‌
కేఎల్‌ రాహుల్‌-కోహ్లిలు ఇన్నింగ్స్‌ ఆరంభించగా, సౌతీ సూపర్‌ ఓవర్‌ వేశాడు..
తొలి బంతి(రాహుల్‌-సిక్స్‌)
రెండో బంతి(రాహుల్‌-ఫోర్‌)
మూడో బంతి(రాహుల్‌ ఔట్‌)
నాల్గో బంతి(కోహ్లి-రెండు పరుగులు)
ఐదో బంతి(కోహ్లి-ఫోర్‌తో విజయం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement