అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు బంగ్లాదేశ్‌ | Ind vs Ban: Indian Spinners Went To Wicketless In A Home Test | Sakshi
Sakshi News home page

అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు బంగ్లాదేశ్‌

Nov 24 2019 2:30 PM | Updated on Nov 24 2019 2:34 PM

Ind vs Ban: Indian Spinners Went To Wicketless In A Home Test - Sakshi

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో పింక్‌ బాల్‌ టెస్టుకు ముందు టీమిండియా పేసర్లు అసలు బౌలింగ్‌ ఎలా వేస్తారనే దానిపై అనేక సందేహాలు తలెత్తాయి. ఎర్రబంతితో రాణిస్తున్న పేసర్లు.. గులాబీ బంతిపై పట్టు సాధిస్తారా అనేది ప్రధాన చర్చగా మారిపోయింది. వాటిని పటాపంచాలు చేస్తూ తమకు ఏ బంతైనా ఒక్కటే అన్న చందంగా టీమిండియా పేసర్లు చెలరేగిపోయారు. మహ్మద్‌ షమీ,  ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లు నిప్పులు చెరిగే బంతులతో బంగ్లాదేశ్‌కు ముచ్చెమటలు పట్టించారు. ఆ క్రమంలోనే మొత్తం వికెట్లను పేసర్లే తమ ఖాతాలో వేసుకున్నారు.

ఈ టెస్టులో భారత్‌ పేసర్లు సాధించిన వికెట్లు 19.  రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ ఆటగాడు మహ్మదుల్లా రిటైర్డ్‌ ఔట్‌గా వెళ్లిపోవడంతో పేసర్ల ఖాతాలో 19 వికెట్లే చేరాయి. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో ఇషాంత్‌ శర్మ మొత్తం 9 వికెట్లు సాధించగా, ఉమేశ్‌ యాదవ్‌ 8 వికెట్లు దక్కించుకున్నాడు. మహ్మద్‌ షమీకి రెండు వికెట్లు లభించాయి. దాంతో స్పిన్నర్ల ఖాతాలో వికెటే లేకుండా పోయింది.

కాకపోతే స్వదేశంలో ఇప్పటివరకూ జరిగిన టెస్టు మ్యాచ్‌ల పరంగా చూస్తూ ఒక టెస్టులో భారత స్పిన్నర్లు కనీసం వికెట్‌ కూడా సాధించకుండా ఉండటం ఇదే రెండోసారి మాత్రమే.  గతంలో శ్రీలంకతో ఇదే వేదికపై జరిగిన టెస్టులో పేసర్లే మొత్తం వికెట్లను తీశారు. 2017-18 సీజన్‌లో జరిగిన ఆ టెస్టులో భారత పేసర్లే  17 వికెట్లను సాధించారు. అయితే ఆ మ్యాచ్‌ డ్రాగా ముగియగా స్పిన్నర్లకు వికెట్లు దక్కలేదు. ఆనాటి మ్యాచ్‌లో పేసర్లు మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు మొత్తం వికెట్లలో భాగస్వామ్యం అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement