ప్రతి మ్యాచ్ కీలకమే | Every match is crucial -Sanjay Manjrekar | Sakshi
Sakshi News home page

ప్రతి మ్యాచ్ కీలకమే

Mar 23 2016 1:08 AM | Updated on Sep 3 2017 8:20 PM

న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత భారత్ తిరిగి గాడిలో పడింది.

 సంజయ్ మంజ్రేకర్
న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత భారత్ తిరిగి గాడిలో పడింది. పాకిస్తాన్‌పై గెలుపు భారత్‌కు అత్యంత కీలకమైంది. ఎందుకంటే టోర్నమెంట్‌లో నిలవాలంటే ఆ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. కాబట్టి అంచనాలకు అనుగుణంగా రాణించి చక్కని విజయాన్ని అందుకుంది. ఇక ఇక్కడి నుంచి భారత్ ఆడబోయే ప్రతి మ్యాచ్ కీలకమే. న్యూజిలాండ్‌తో ఊహించని పరాజయం తర్వాత భారత్ అదృష్టం కొద్దీ పాక్‌తో తలపడింది. చాలా మంది ఈ మ్యాచ్‌పై ఆసక్తి చూపడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అయితే ఈ రోజుల్లో పాక్‌ను ఓడించడం భారత్‌కు చాలా సులువుగా మారింది. కాబట్టి తొలి ఓటమి తర్వాత టీమిండియాకు తక్షణ విజయం దక్కింది. దీంతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది.

ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు చాలా మెరుగుపడుతోంది. కానీ ఇద్దరు బౌలర్లపై ఐసీసీ కొరడా ఝుళిపించడం ఆందోళనగా మారింది. తుది జట్టులో టస్కిన్ లేకపోవడం బౌలింగ్‌పై ప్రభావం చూపుతుంది. ఆస్ట్రేలియాపై తమీమ్ ఆడకపోవడంతో తుది జట్టులో అతని ఎంపికపై సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారిన ఆటలో షాట్లు ఆడే సమయంలో మరింత బలం వచ్చేందుకు గాను బరువు ఎక్కువ ఉన్న బ్యాట్‌లను వాడినా ఎవరూ పట్టించుకోరు.

కానీ అదే బౌలర్లు మోచేతిని కొద్దిగా పక్కకు వంచితే మాత్రం వేటు వేస్తున్నారు. ఒకరకంగా ఇది బౌలర్ల పట్ల చాలా కఠినంగా వ్యవహరించడమే. భారత్, బంగ్లాదేశ్‌ల మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది. కాబట్టి భారత్‌కు స్పిన్ వికెట్ కాకుండా తొలిసారి మంచి బ్యాటింగ్ పిచ్ లభించనుంది. ధావన్, రోహిత్‌లకు ఇది శుభవార్త.

Advertisement
 
Advertisement
Advertisement