నా రికార్డు బద్దలు చేసేది అతనే: సచిన్‌

Birthday Boy Sachin Says Virat Kohli Breaks my Record - Sakshi

అతనితో​ షాంపెన్‌ బాటిల్‌ పంచుకుంటా

ముంబై : వన్డేల్లో తన పేరిట ఉన్న అత్యధిక సెంచరీల(49) రికార్డును టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బద్దలు కోడుతాడని దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌ చరిత్రలో​ చెరుగని ముద్ర వేసుకున్న సచిన్‌ నేడు 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్‌ తన రికార్డు బ్రేక్‌ అనంతరం కెప్టెన్‌ కోహ్లితో షాంపెన్‌ బాటిల్‌ను పంచుకుంటానన్నాడు.

‘‘నేను అతనికి షాంపెన్‌ బాటిల్‌ను పంపించను. నా రికార్డును అధిగమించిన అనంతరం నేనే స్వయంగా వెళ్లి అతనితో షాంపెన్‌ బాటిల్‌ను పంచుకుంటా.’’ అని సచిన్‌ వ్యాఖ్యానించాడు. ఇక కోహ్లి బ్యాటింగ్‌లో సూపర్‌ ఫాస్ట్‌ ట్రైన్‌లా దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా గత నాలుగేళ్లుగా అతను స్థిరంగా రాణిస్తున్నాడు. వన్డేల్లో​ ఇప్పటికే 35 సెంచరీలు సాధించిన కోహ్లి.. సచిన్‌ రికార్డు (49)ను అధిగమించడానికి మరో 15 సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇదే ఫామ్‌తో రాణిస్తే మరికొద్ది రోజుల్లోనే కోహ్లి ఈ ఘనతను అందుకుంటాడు. ప్రస్తుత తరంలో ఈ రికార్డు అధిగమించే శక్తి కోహ్లికి మాత్రమే ఉంది. ఈ విషయాన్ని టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం పేర్కొన్నాడు. గతంలో సోషల్‌ మీడియా వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సెహ్వాగ్‌.. వన్డేల్లో కోహ్లి 62 సెంచరీలు సాధిస్తాడని తెలిపాడు.

సచిన్‌ స్పూర్తితోనే క్రికెట్‌లోకి.. చాలా ఇంటర్వ్యూల్లో కోహ్లి సచిన్‌ స్పూర్తితోనే క్రికెట్‌ కెరీర్‌ను ఎంచుకున్నట్లు స్పష్టం చేశాడు. ‘సచిన్‌ వల్లనే నేను క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టా. అతను దేశానికి చేసిన సేవ నాకు స్పూర్తిని కలిగించింది. నేను చాలా అదృష్టవంతుడిని. నా కెరీర్‌ ప్రారంభ దశల్లో సచిన్‌తో ఆడాను. అతని సూచనలతో నా ఆటను మెరుగుపరుచుకున్నా. అతనెప్పుడు యువ ఆటగాళ్లకు స్పూర్తేనని’ కోహ్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top