ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై ఒత్తిడి తెచ్చాం | BCCI threatened ICC to get revamp done: Sanjay Patel | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై ఒత్తిడి తెచ్చాం

Jun 8 2014 1:07 AM | Updated on Sep 2 2017 8:27 AM

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై ఒత్తిడి తెచ్చాం

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై ఒత్తిడి తెచ్చాం

ఐసీసీలో సమూల మార్పులు చేయడంతో పాటు ఆదాయంలో భారత్‌కు అధిక వాటా ఇవ్వాలని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై బాగా ఒత్తిడి తెచ్చామని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు.

రెండో ఐసీసీని ఏర్పాటు చేస్తామని బెదిరించాం
 ఐసీసీలో మార్పులపై బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వ్యాఖ్య
 
 హైదరాబాద్: ఐసీసీలో సమూల మార్పులు చేయడంతో పాటు ఆదాయంలో భారత్‌కు అధిక వాటా ఇవ్వాలని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై బాగా ఒత్తిడి తెచ్చామని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. వీటికి ఒప్పుకోకపోతే సమాంతరంగా రెండో ఐసీసీని ఏర్పాటు చేస్తామని వాళ్లను బెదిరించామన్నారు. ‘ఈ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. ఈ మార్పులకు చాలా మంది ఒప్పుకోలేదు. భారత్‌కు సరైన వాటా ఇవ్వకుంటే మేం బలవంతంగా రెండో ఐసీసీని రన్ చేస్తామని హెచ్చరించాం. ఇలా చెప్పిన తర్వాత ఇంగ్లండ్, ఆసీస్‌లు దిగి వచ్చాయి. జూన్ 27 నుంచి ఐసీసీలో కొత్త విధానాలు అమల్లోకి వస్తాయి. మా తీర్మానంపై పది సభ్య దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు’ అని పటేల్ పేర్కొన్నారు.
 
 శ్రీనివాసన్ అమాయకుడు
 ఈనెలాఖరులో కొత్త ఐసీసీ తొలి చైర్మన్‌గా ఎన్.శ్రీనివాసన్ బాధ్యతలు తీసుకోవడాన్ని ఎవరూ అడ్డుకోలేరని పటేల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోబోదన్నారు. స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణకు సంబంధించి శ్రీని అమాయకుడని చెప్పారు. ‘బాధ్యతలు స్వీకరించేందుకు మేమిద్దరం మెల్‌బోర్న్ వెళ్తున్నాం. గత నాలుగు నెలల నుంచి అన్ని సమస్యలను పరిష్కరించాం. కొత్త ఆర్థిక విధానాలకు అన్ని దేశాల బోర్డులను ఒప్పించాం. ఇక నుంచి ఐసీసీలో భారత్‌దే పెద్ద పాత్ర. గతంలో 4 శాతం వాట మాత్రమే దక్కేది. కానీ ఇప్పుడు రాబోయే ఎనిమిదేళ్లలో ఐసీసీకి సుమారుగా 2.8 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది. ఇందులో భారత్‌కు 700 నుంచి 800 మిలియన్ డాలర్ల ఆదాయం దక్కుతుంది’ అని పటేల్ వెల్లడించారు.
 
  విదేశీ పర్యటనల షెడ్యూల్‌ను 2020 వరకు సిద్ధం చేశామన్నారు. ఐసీసీ ప్రధాన కార్యాలయాన్ని భారత్‌కు తరలించే అవకాశాలను కూడా పరిశీలిస్తామన్నారు. ఐపీఎల్-7 బాగా విజయవంతమైందని చెప్పిన సంజయ్ గతంలో కంటే ఈసారి టికెట్ల ఆదాయం భారీగా పెరిగిందన్నారు. మీడియా విషయంలో బోర్డుపై వస్తున్న విమర్శలపై స్పందించిన పటేల్... ఈ విభాగాన్ని పూర్తిగా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement