ఆసీస్‌ క్రికెటర్‌కు కరోనా.. మ్యాచ్‌కు దూరం?! | Australian Bowler Kane Richardson Tested For Coronavirus Over Illness | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ క్రికెటర్‌కు ‘కరోనా’ టెస్టులు.. వన్డేకు దూరం!

Mar 13 2020 11:23 AM | Updated on Mar 13 2020 11:54 AM

Australian Bowler Kane Richardson Tested For Coronavirus Over Illness - Sakshi

సిడ్నీ: తమ ఫాస్ట్‌ బౌలర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌ అనారోగ్యం పాలైన నేపథ్యంలో.. అతడికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ నేపథ్యంలో అతడిని క్వారంటైన్‌కు తరలించినట్లు వెల్లడించింది. దీంతో శుక్రవారం నాటి ఆసీస్‌- కివీస్‌ తొలి వన్డే మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. ఈ విషయం గురించి సీఏ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... ‘‘ అంతర్జాతీయ ప్రయాణాల తర్వాత కేన్‌ 14 రోజుల క్రితమే తిరిగి వచ్చాడు. అతడు గొంతుకు ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు మా వైద్య సిబ్బంది పేర్కొంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రొటోకాల్‌ ప్రకారం అతడికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. జట్టుకు దూరంగా ఉంచుతున్నాం. టెస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడైన తర్వాత.. అతడు పూర్తిగా కోలుకున్నాడని నిర్ధారణ అయిన తర్వాత తిరిగి జట్టులోకి తీసుకుంటాం’’అని క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి తెలిపారు. (ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు!)

ఇక కరోనా వ్యాప్తి భయంతో మొదటి వన్డేను క్లోజ్డ్‌ డోర్స్‌లో నిర్వహించనున్నట్లు సీఏ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న తొలి వన్డేలో టాస్‌ గెలిచిన ఆసీస్‌... బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక ప్రాణాంతక వైరస్‌ ‘కోవిడ్‌19’ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పటికే వేల మందిని చంపేసింది. లక్ష మందికిపైగా సోకింది. దీంతో కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు వాయిదా పడ్డాయి. ఐపీఎల్‌ నిర్వాహకులను కూడా ఈ వైరస్‌ భయం గడగడలాడిస్తోంది. (చివరి రోజు మ్యాచ్‌.. ప్రేక్షకులు లేకుండానే!)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement