ఆనంద్‌కు మిశ్రమ ఫలితాలు

Anand tied fourth after first day of St. Louis rapid chess - Sakshi

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): ప్రపంచ మాజీ చాంపియన్, భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌కు సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తొలిరోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మొదట విజయంతో శుభారంభం చేసిన ఆనంద్‌ తర్వాత రెండో రౌండ్లో ఓడిపోయాడు. మూడో రౌండ్లో డ్రా చేసుకున్నాడు. తొలి రౌండ్లో అమెరికాకు చెందిన హికరు నకమురపై 35 ఎత్తుల్లో గెలిచిన ఆనంద్‌... ఫ్రాన్స్‌ ఆటగాడు మ్యాక్సిమ్‌ వాచిర్‌ లాగ్రేవ్‌తో జరిగిన రెండో గేమ్‌లో 57 ఎత్తుల్లో ఓడిపోయాడు. రష్యా ఆటగాడు సెర్గెయ్‌ కర్జాకిన్‌తో జరిగిన మూడో రౌండ్‌ గేమ్‌ను ఆనంద్‌ 29 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. దీంతో తొలిరోజు మూడు పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నీలో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్‌ లభిస్తుంది. మరోవైపు మూడు గేముల్లోనూ గెలిచిన ఫాబియానో కరువానా (అమెరికా) ఆరు పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top