
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహా మోసకారి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విమర్శించారు.
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహా మోసకారి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. బుధవారం జరిగిన బూత్ కన్వీనర్ల శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ.. ‘నయవంచన చేయటంలో చంద్రబాబుకు తిరుగులేదు. అధికారంలోకి రావటానికి మళ్ళీ మాయమాటలు చెప్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత బూత్ కన్వినర్లు, కార్యకర్తలదే. గత ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ చూసింది.. కానీ మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకోమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు.
ఆతర్వాతే బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ జగన్, బీజేపీ కలిశాయంటూ చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ మోసం చేశారని చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత చెప్తున్నారు. మరి ఆయన నలభై ఏళ్ల అనుభవం ఏమైంది? ఎందుకని ముందుగానే గుర్తుంచలేదు? వాచీ, చెయిన్ పెట్టుకోనని చంద్రబాబు చెప్తుంటారు. అవి పెట్టుకుంటే ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తాయనే పెట్టుకోరన్న సంగతి జనానికి తెలుసు. మందు తాగనంటాడు.. కానీ ప్రజల రక్తం తాగుతున్నారు. ఇలాంటి నీచపాలనకు చరమగీతం పాడాలి’ అని తెలిపారు.