చంద్రబాబు అసలీ జీవో చదివారా? | ys jagan mohan reddy challenges in ap assembly | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అసలీ జీవో చదివారా?

Dec 13 2019 6:16 AM | Updated on Dec 13 2019 6:16 AM

ys jagan mohan reddy challenges in ap assembly - Sakshi

ఇంగ్లిష్‌ వచ్చిన వాళ్లు చదివితే ఈ జీవోలో తప్పు కనిపించదు. ఇంగ్లిష్‌ రాకపోతేనో, అర్థం చేసుకోవడంలో లోపం ఉంటే తప్ప.. తప్పుగా అనిపించదు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ పెద్ద మనిషికి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏదీ లేదు.  

సాక్షి, అమరావతి :  ప్రజాస్వామ్య హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోపై చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో గురువారం 2430 జీవో రద్దుకు విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో సీఎం స్పందిస్తూ మాట్లాడారు. ‘ప్రభుత్వం ఇచ్చిన 2430 జీవోను రద్దు చేయాలని టీడీపీ అడుగుతున్న ధోరణి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అసలీ జీవోను చంద్రబాబు నాయుడు చదివారా? ఒకవేళ చదివుంటే ఇంగ్లిష్‌ భాషను అర్థం చేసుకోవడంలో లోపం ఉందేమో! నేనోసారి జీవోను చదివి విన్పిస్తాను. ఇందులో ఎక్కడైనా, ఏదైనా తప్పుంటే మీరే ఆలోచించి చెప్పండి. (జీవో చదివి విన్పించారు) ఇందులో ఏం తప్పుందని చెబుతున్నారు.

ఎక్కడైనా, ఎవరైనా అన్యాయంగా, ఉద్దేశ పూర్వకంగా, ఆధారాలు లేకుండా, తప్పుడు వార్తలు, పరువు తీసే వార్తలు వేస్తే.. అలాంటప్పుడు సంబంధిత విభాగాల కార్యదర్శులు రిజాయిండర్‌ జారీ చేయడం, ఫిర్యాదు చేయడం, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ఉంది. అవతల వాళ్లు ఏ తప్పులు రాసినా, టీవీల్లో తప్పులు చూపించినా, జరగనివి జరిగినట్టు చూపించినా, రాసినా.. ప్రభుత్వం, అధికారులు ఆ చెడ్డ పేరు మోస్తూ మౌనంగా ఉండాల్సిందేనా? ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్లు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కాబట్టి, వాళ్లు ఇష్టమొచ్చినట్టు చంద్రబాబు నాయుడును భుజానికెత్తుకుని మోస్తూ.. ప్రభుత్వంపై నిందలు మోపినా కూడా పడి ఉండాల్సిందేనా? న్యాయం ఉండదా? ఎవరైనా తప్పు చేస్తే, అబద్ధాలు రాస్తే నా ఇమేజ్‌ను నేను కాపాడుకునే స్వేచ్ఛ అది. ప్రజాస్వామ్య హక్కు. అందులో భాగంగానే రిజాయిండర్స్‌ ఇవ్వచ్చు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా కేసులు వేయొచ్చు’ అని సీఎం జగన్‌ వివరించారు.   
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement