ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం

కాంక్లేవ్‌లో పాల్గొన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. చిత్రంలో ఎంపీ సీఎం రమేష్, రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ - Sakshi

ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి బయట నుంచి మద్దతు

శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

 బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు):  2019లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడంలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. విశాఖలో జరుగుతున్న ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్‌లో ఆయన పాల్గొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో విజయం ఎవరిది?’ అంశంపై ఇండియాటుడే కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చర్చించారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తప్పక అధికారంలోకి వస్తుందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ పార్టీ బయట నుంచి మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు.

కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చించలేదు: ఎంపీ రమేష్‌
ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్‌ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయలా? లేదా అనే అంశంపై ఇంకా చర్చించలేదని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను దారుణంగా మోసం చేసిందని వ్యాఖ్యానించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top