మోదీ ఇస్తున్నారు..బాబు తీసేస్తున్నారు | Somu Veerraju Slams Chandrababu In Vijayawada | Sakshi
Sakshi News home page

టీడీపీ సర్పంచ్‌లే తప్పుపడుతున్నారు: సోము

Aug 1 2018 2:07 PM | Updated on Oct 22 2018 8:57 PM

Somu Veerraju Slams Chandrababu In Vijayawada - Sakshi

బీజేపీ నేత సోము వీర్రాజు(పాత చిత్రం)

కాపు రిజర్వేషన్ల తీర్మానం కేంద్రానికి పంపిన తర్వాత ఏనాడూ చంద్రబాబు రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదని తెలిపారు.

విజయవాడ: ఏపీలో వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ నేత సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్ల పాలన పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని,  అభివృద్ధికి స్పెషల్‌ ఆఫీసర్ల పాలన వ్యతిరేకమన్నారు. దీనిపై గవర్నర్‌ స్పందించాలని వ్యాఖ్యానించారు. బుధవారం బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత సోము వీర్రాజు విలేకరులతో మాట్లాడారు. సర్పంచ్‌లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెక్‌ పవర్‌ ఇస్తే దాన్ని సీఎం తొలగించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్ణయాన్ని టీడీపీ సర్పంచ్‌లే తప్పుపడుతున్నారని చెప్పారు.

సీఎం చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, సర్పంచ్‌ల ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి తోమర్‌కు ఫిర్యాదు చేశాం..విచారణ జరపాలని కోరాం..వీటిపై విచారణ జరిపితే లోకేష్‌కు వచ్చిన అవార్డులు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల తీర్మానం కేంద్రానికి పంపిన తర్వాత ఏనాడూ చంద్రబాబు రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదని తెలిపారు. కాపు రిజర్వేషన్లపై మా అభిప్రాయాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఇప్పటికే స్పష్టం చేశామని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement