మందిర నిర్మాణంపై పవార్‌ కీలక వ్యాఖ్యలు | Sharad Pawar Comments On Ayodhya Ram Temple | Sakshi
Sakshi News home page

మందిర నిర్మాణంపై పవార్‌ కీలక వ్యాఖ్యలు

Jul 20 2020 10:47 AM | Updated on Jul 20 2020 11:12 AM

Sharad Pawar Comments On Ayodhya Ram Temple - Sakshi

సాక్షి, ముంబై : హిందువుల చిరకాల స్వప్పం అయోధ్య రామాలయ నిర్మాణానికి చకచక ఏర్పాటు జరుగుతున్న తరుణంలో నేషనలిస్ట్‌‌ కాన్ఫరెన్స్‌ పార్టీ (ఎన్సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో​ కరోనా విలయ తాండవం చేస్తుంటే కొందరు వ్యక్తులు మాత్రం ఆలయ నిర్మాణంతోనే వైరస్‌ను అంతం చేయవచ్చన్న భ్రమల్లో ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ పౌరులంతా కరోనా ప్రతాపానికి భయాందోళనకు గురవుతుంటే ఇలాంటి క్లిష్ట సమయంలో అయోధ్య మందిర నిర్మాణానికి లేనిపోని ఆత్రుత ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేఖరి మందిర భూమి పూజ కార్యక్రమంపై ప్రశ్నించగా పవర్‌ ఈ విధంగా స్పందించారు. బీజేపీ పేరు ప్రస్తావించకుండా ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. (మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణం)

కాగా రామ మందిర నిర్మాణానికి ఆలయ కమిటీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆగస్ట్‌ తొలివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. మోదీతో పాటు మరో 250 మంది ప్రముఖులకు ఆహ్వానం పంపనున్నారు. దీని కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన.. ఆలయ నిర్మాణంపై సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హిందువుల చిరకాల స్వప్పమైన ఆలయాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేయాలని ఇదివరకే ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement