సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

Sarve Satyanarayana On TDP And Congress Alliance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య సంబంధాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం బోడుప్పల్‌లో జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో సర్వే చేసిన వ్యాఖ్యలతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీలు కలిసిపోయేలా ఉన్నాయని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనతో కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు.

తనకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ముందుగానే కేంద్ర మంత్రి పదవి రిజర్వేషన్‌ చేసి ఉంచారని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం కొన్ని కార్యక్రమాల్లో వారి తీరుతో తెలిపోయింది.  కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణ స్వీకారం రోజున రాహుల్‌తో చంద్రబాబు వ్యవహరించిన తీరు, ఇటీవల అవిశ్వాస తీర్మాణంపై చర్చలో భాగంగా పార్లమెంటులో టీడీపీ, కాంగ్రెస్‌లు ఉమ్మడి అజెండాతో పనిచేయడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీల పొత్తు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top