జీవితంలో అమిత్ షా చెప్పిన ఒకే ఒక్క నిజం.. | Rahul Gandhi Criticises Narendra Modi And Amit Shah | Sakshi
Sakshi News home page

జీవితంలో అమిత్ షా చెప్పిన ఒకే ఒక్క నిజం..

Apr 7 2018 5:39 PM | Updated on Sep 5 2018 1:55 PM

Rahul Gandhi Criticises Narendra Modi And Amit Shah - Sakshi

రాహుల్ గాంధీ

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్ష బీజేపీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల దాడిని తీవ్రం చేశారు. ఎట్టకేలకు ఎన్నికల నేపథ్యంలోనైనా బీజేపీ జాతీయధ్యక్షుడు అమిత్ షా తన జీవితంలో ఒక్కసారే నిజాన్ని చెప్పారన్నారు. బీజేపీ నేత, మాజీ సీఎం యాడ్యూరప్ప ప్రభుత్వమే అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వమని అమిత్ షా చెప్పడమే ఆ నిజమంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కోలార్‌లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఆరెస్సెస్‌లపై విరుచుకుపడ్డారు. 

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ సిద్ధాంతాలను, ఆరెస్సెస్ భావజాలాన్ని ఓడించి బీజేపీని ఇంటికి సాగనంపుతుందన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోతుందని ప్రధాని మోదీకి కూడా తెలుసునని.. అందులో ఆయనలో భయం కనిపిస్తుందన్నారు. ఆపై ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ మంత్రులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ బీజేపీ అలా చేయాలనుకుంటే ముందుగా కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాల్సి ఉంటుందని ఘూటు వ్యాఖ్యలు చేశారు. 

ఇది రాజకీయ యుద్దం కాదని, కర్ణాటక ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న పోరాటమని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను అభివర్ణించారు. హెచ్‌ఏఎల్ నుంచి రాఫెల్ ఒప్పందాన్ని దూరం చేసి బెంగళూరుకు వచ్చే వేలాది ఉద్యోగాలను ఇక్కడి నిరుద్యోగులకు ప్రధాని మోదీ దూరం చేశారని రాహుల్ విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement