‘బుల్లెట్ ట్రైన్ కాదు.. మ్యాజిక్ ట్రైన్’
అమేథీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం విమర్శల వర్షం కురిపించారు. అమేథీ పర్యటనలో ఉన్న రాహుల్ మాట్లాడుతూ.. మోదీ చేపట్టింది బుల్లెట్ ట్రైన్ కాదు.. మ్యాజిక్ ట్రైన్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తి కాదని ఆరోపించారు. ఆహ్మద్బాద్, ముంబైల మధ్య నిర్మించ తలపెట్టిన బుల్లెట్ ట్రైన్ మ్యాజిక్గానే మిగులుతుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బుల్లెట్ ట్రైన్ కల సాకారమవుతుందని ఆయన పేర్కొన్నారు.
భారీ వ్యయంతో మోదీ ప్రభుత్వం చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్పై తొలి నుంచి విపక్షాలు ఎదురుదాడి చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ప్రాజెక్టుపై రాహుల్ మాట్లాడుతూ..‘మోదీ జీ స్నేహితులైన ధనికులు ప్రయాణించడానికే బుల్లెట్ ట్రైన్ ఉపకరిస్తుంది. ఇది భారత్కు ఇప్పుడు అనవసరం. 2016లో దేశంలో చోటుచేసుకున్న వేర్వేరు రైలు ప్రమాదాల్లో 200మంది మరణించారు. బుల్లెట్ ట్రైన్కు వెచ్చించే భారీ మొత్తాన్ని రైల్వే భద్రతకు మళ్లిస్తే.. రైలు ప్రమాదాలో ఒక్కరు కూడా మృతిచెందకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చ’ని పేర్కొన్న సంగతి తెలిసిందే.
సంబంధిత వార్తలు