పెట్రో మంటల నడుమ పొలిటికల్ కామెడీ!
ఇతర రాష్ట్రాల్లో కంటే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.5–7 అధికం
పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే అధిక పన్నుల మోత
జనం జేబులు గుల్ల చేస్తున్న బాబు సర్కారు
రాష్ట్రంలో పన్నులు తగ్గించాలని కోరితే ససేమిరా
10వ తేదీన బంద్లో పాల్గొనాలంటూ టీడీపీకి కాంగ్రెస్ పార్టీ పిలుపు
బంద్ను విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సూచన
గతంలో హోదా కోసం వైఎస్సార్సీపీ బంద్కు పిలుపునిస్తే విఫలం చేసేందుకు కుట్ర
అప్పట్లో గ్యాస్ సిలిండర్పై రూ.50 అదనపు భారాన్ని భరించిన దివంగత వైఎస్సార్
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్పై ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా పన్నులు వసూలు చేస్తూ ఖజానా నింపుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ధరల పాపం తనది కాదంటూ జనం చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. ఒకవైపు పన్నుల పోటుతో ప్రజల రక్తాన్ని పిల్చేస్తూ.. మరోవైపు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ నిర్వాకం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రో ధరలు 5–7 రూపాయలు అధికం కావడం గమనార్హం. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, ఒడిశా రాష్ట్రాల కంటే ఏపీ ప్రభుత్వమే పెట్రోల్, డీజిల్పై ఎక్కువ పన్నులు వసూలు చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఖజానాకు పెట్రోలు, డీజిల్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రెట్టింపు అయిందంటే ప్రభుత్వం ఏ స్థాయిలో పన్నులు విధించిందో అర్థం చేసుకోవచ్చు.
దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే అధికంగా ఉన్న పన్నులు, పెట్రో ధరలతో జనం కష్టాలు పడుతున్నారన్న వాస్తవాన్ని విస్మరించిన కాంగ్రెస్ పార్టీ ఈ నెల 10వ తేదీన తాను తలపెట్టిన బంద్లో పాల్గొనాలంటూ అధికార తెలుగుదేశం పార్టీకి పిలుపునిచ్చింది. పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ఈ బంద్లో పాల్గొని, విజయవంతం చేయాలంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చంద్రబాబు అంతర్గతంగా సూచించినట్లు సమాచారం. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ గతంలో బంద్కు పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ కనీసం మద్దతు తెలపలేదు. ఈ బంద్ను విఫలం చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కుట్రలు పన్నింది. కానీ, ఇప్పుడు స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బంద్ పేరిట పరస్పరం సహకరించుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీలకు ప్రజా ప్రయోజనాల కంటే సొంత రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? అని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పన్నులు పైసా కూడా తగ్గించం
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లోనే ధరలు అధికంగా ఉండడంతో రాష్ట్ర సరిహద్దుల్లోని ప్రజలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్, డీజిల్ తెచ్చుకుంటున్నారు. ఏపీలో పొరుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వందలాది పెట్రోల్ బంకులు ఇప్పటికే మూతపడ్డాయి. లీటర్ పెట్రోల్పై కేంద్రానికి పన్నుల రూపంలో రూ.19.48 వస్తుండగా, ఏపీకి రూ.21.20 వస్తోంది. డీజిల్పై కేంద్రం పన్నుల రూపంలో రూ.15.33 వసూలు చేస్తుండగా, ఏపీ ప్రభుత్వం రూ.17.10 వసూలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై సుంకాలను రూ.9.48 నుంచి రూ.21.48కు, డీజిల్పై రూ.3.56 నుంచి రూ.17.33కు పెంచింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం పెట్రోల్పై పన్నుల భారాన్ని రూ.13.95 నుంచి రూ.20.95కు, డీజిల్పై రూ.8.86 నుంచి రూ.14.87కు పెంచేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్రం పెంచిన సుంకాల్లో రూ.2 తగ్గించగా, రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. పన్నులను పైసా కూడా తగ్గించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
జనంపై ‘అదనపు’ బాదుడు
పెట్రోల్, డీజిల్పై పన్నులు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం 2015లో లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.4 చొప్పున అదనపు ‘వ్యాట్’ను విధించింది. దీంతో పన్నులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రవాణా రంగం, నిత్యావసర వస్తువుల ధరలపై నేరుగా ప్రభావం చూపే డీజిల్పై దేశంలోనే అత్యధిక పన్ను వసూలు చేస్తున్నది ఏపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో డీజిల్పై 22.25 శాతం వ్యాట్, లీటర్కు రూ.4 అదనపు వ్యాట్.. అంటే మొత్తం కలిపి 28.08 శాతం పన్ను వసూలు చేస్తోంది. పెట్రోల్పై విధిస్తున్న పన్నులో మహారాష్ట్ర తర్వాత ఏపీ రెండో స్థానంలో ఉంది. ఏపీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై 31 శాతం వ్యాట్, రూ.4 అదనపు వ్యాట్.. అంటే మొత్తం 35.77 శాతం పన్ను వసూలు చేస్తోంది. ఈ స్థాయి పన్ను రేట్లు సరిహద్దు రాష్ట్రాల్లో లేకపోవడం విశేషం.
పెట్రో ఆదాయం రెట్టింపు
పెట్రోల్ ధరలు పెరిగి సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ధరలు పెరుగుతుండటంతో లక్ష్యాలకు మించి ఆదాయం ఖజానాకు వచ్చి చేరుతోంది. ఈ ఏడాది పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా రూ.10,800 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా మొదటి నాలుగు నెలల్లోనే రూ.3,728 కోట్ల ఆదాయం వచ్చేసింది. 2014–15లో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రూ.5,270 కోట్లుగా ఉన్న పెట్రో ఆదాయం 2017–18 నాటికి రూ.9,694 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో 18 శాతం కేవలం పెట్రోల్, డీజిల్ నుంచే సమకూరుతుండడం గమనార్హం. రాష్ట్ర విభజన సమయంలో 13 జిల్లాల నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా సగటున నెలకు రూ.439 కోట్ల ఆదాయం వచ్చేది. అది ఇప్పుడు ఏకంగా రూ.932 కోట్లకు పెరిగిపోయింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.10,800 కోట్లు.. అంటే ప్రతినెలా సగటున రూ.900 కోట్లు ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా, గడిచిన నాలుగు నెలల్లో సగటున రూ.932 కోట్ల చొప్పున ఆదాయం వచ్చింది.
వైఎస్సార్ చూపిన చొరవ ఆదర్శప్రాయం
పెట్రోల్, డీజిల్పై పన్నుల భారం తగ్గించకుండా సీఎం చంద్రబాబు ఆ నెపాన్ని కేంద్రంపైకి నెడుతుండడం పట్ల సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయని గ్యాస్ సిలెండర్ ధరను రూ.50 చొప్పున పెంచితే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. ప్రతి సిలిండర్పై రూ.50 అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించారు. కానీ, పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఒకసారి సుంకం తగ్గించినా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు తన వంతుగా పైసా కూడా తగ్గించకపోవడం ఏమిటని జనం మండిపడుతున్నారు. గతంలో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్రంలో అదనపు ‘వ్యాట్’ను సైతం పెంచేశారని, ఇప్పుడు ముడిచమురు ధరలు రికార్డు స్థాయికి చేరినా అదనపు ‘వ్యాట్’ను ఎందుకు తగ్గించడం లేదని నిలదీస్తున్నారు.
పన్నులు తగ్గించరు గానీ ‘బంద్’ చేస్తారట!
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రాజధాని అమరావతిలో శనివారం లీటర్ పెట్రోల్ రూ.86.4, డీజిల్ రూ.79.62కు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించి, ప్రజలకు ఊరట కల్పించాల్సింది పోయి ఈ వ్యవహారాన్ని రాజకీయాల ప్రయోజనాల కోసం వాడుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికంగా పన్నులు విధిస్తూ, ఆ మేరకు ఆదాయం పొందుతున్న టీడీపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రమే తగ్గించాలంటూ డిమాండ్ చేస్తోంది. పెట్రో ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ నిందిస్తున్నారు. సొంత రాష్ట్రంలో ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయని ప్రశ్నిస్తే మాత్రం నోరు విప్పడం లేదు. పెట్రో ధరల పాపాన్ని కేంద్రంపై నెట్టేసి, తెలివిగా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెట్రో ధరల మంటకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్లో పాల్గొని, విజయవంతం చేయాలంటూ సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పిలునివ్వడం గమనార్హం.
సంబంధిత వార్తలు