మోదీకి థ్యాంక్స్‌.. లోక్‌సభలో లొల్లి.. గందరగోళం | Lok Sabha adjourned till noon | Sakshi
Sakshi News home page

మోదీకి థ్యాంక్స్‌.. లోక్‌సభలో లొల్లి.. గందరగోళం

Dec 18 2017 12:03 PM | Updated on Aug 21 2018 2:39 PM

Lok Sabha adjourned till noon - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల ప్రభావం ఢిల్లీని తాకింది. పార్లమెంటులోని లోక్‌సభలో ఎన్నికల ఫలితాలు ధుమారం రేపాయి. ప్రతిపక్ష సభ్యులంతా తమ స్థానాల్లో నుంచి లేచి బెంచ్‌లపై నిల్చొని బీజేపీ వ్యతిరేక నినాదాలు చేయడంతో స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఇంతకీ సభలో ఏం జరిగిందంటే.. సోమవారం గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లింది.

అయితే, లోక్‌సభ ప్రారంభంకాగానే ట్రెజరీ విభాగానికి చెందిన బీజేపీ ఎంపీ కిరిట్‌ సోమయా తొలి ప్రశ్న అడగాల్సి ఉంది. అయితే, ఆయన అందుకు బదులు కాంగ్రెస్‌ పార్టీ హిమాచల్‌ ప్రదేశ్ ను కోల్పోయింది‌, గుజరాత్‌లో మరోసారి బీజేపీ విజయాన్ని సొంతం​ చేసుకుంది. ఈ సందర్భంగా నేను ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’ అని అన్నారు. దీంతో ఒక్కసారిగా ప్రతిపక్షాలు ఆయన చర్యను తప్పుబట్టాయి. వెంటనే తమ స్థానాల్లో నుంచి నిల్చొని కేంద్రం వ్యతిరేక నినాదాలు చేశాయి. స్పీకర్‌ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోవడంతో సభను వాయిదా వేశారు.    

Advertisement
 
Advertisement
Advertisement