బాబును విలన్‌గా చూపించడం బాలకృష్ణ వల్ల కాదు

Laxmi Parvathi Critics Bala Krishna Over NTR Biopic - Sakshi

ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి

సాక్షి, తిరుమల: సీఎం చంద్రబాబునాయుడును ఎన్‌టీఆర్‌ జీవిత చరిత్ర సినిమాలో విలన్‌గా చూపించడం బాలకృష్ణ వల్ల కాదని దివంగతనేత ఎన్‌టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి తెలిపారు. బుధవారం తిరుమల శ్రీవారిని విరామ సమయంలో ఆమె దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ఆమెకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయం వెలుపల ఆమె మాట్లాడుతూ బాలకృష్ణ రెండు, మూడు పార్టులుగా సినిమా తీసినా ఎన్‌టీఆర్‌ జీవిత చరిత్ర సగమే ఉంటుందన్నారు. నిర్భయంగా ఎన్‌టీఆర్‌ అనుభవించిన ఆత్మక్షోభ రాంగోపాల్‌వర్మ తీస్తారన్నారు.

23 సంవత్సరాలుగా ఎన్‌టీఆర్‌కు జరిగిన అవమానంపై పోరాడుతున్నానన్నారు. చంద్రబాబు వెన్నుపోటు చర్యవల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, నా కుటుంబం మొత్తాన్ని తనవైపు తిప్పుకుని నన్ను దూరం చేశాడన్నారు. ఎన్‌టీఆర్‌ కుటుంబం నన్ను ఒప్పుకోలేదని విమర్శించారని, కానీ ప్రభుత్వం వచ్చినప్పుడు నన్ను అందరూ అంగీకరించారన్నారు. ఆనాడు ఎన్‌టీ రామారావు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ స్థాపించారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జగన్‌ ఉన్నారు కాబట్టే ఆయనతో పాటు పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు.

శ్రీవారి ఆశీస్సులతో ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగిసిందన్నారు. సంకల్పయాత్ర అనంతరం గురువారం తిరుమలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజా ఆశీస్సులతో వైఎస్‌ జగన్‌ అఖండ విజయాన్ని సాధించాలని ఆకాంక్షించానన్నారు. ప్రజలకు అన్యాయం చేస్తున్నవారిని, అవినీతికి పాల్పడుతున్న వారిని ప్రజావ్యవస్థ నుంచే తొలగివెళ్లేలా చేయాలని స్వామివారిని కోరానన్నారు. రాష్ట్రానికి నూతన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలన్నారు. 2 రోజుల క్రితం విడుదల చేసిన లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌లోని పాట తనను విమర్శించే విధంగా ఉందన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top