‘నా పిల్లల తండ్రే ప్రధాని కాబోతున్నాడు’

Jemima Goldsmith Congratulates Imran Khan - Sakshi

ఇస్లామాబాద్‌ : మరి కొద్ది గంటలు మాత్రమే ఉంది.. పాకిస్తాన్‌ ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడడానికి. కానీ ఈ లోపే అభిమానులు తమ భావి ప్రధానిగా మాజీ క్రికెటర్‌, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రకటించేశారు. మొత్తం 272 స్థానాలకుగాను పీటీఐ 120 స్థానాల్లో ఆధిపత్యంలో కొనసాగుతూ, మ్యాజిక్‌ ఫిగర్‌ 137 వైపు వడివడిగా అడుగులేస్తోంది. ఇంకా పూర్తి ఫలితాలు వెలువడక ముందే ఇప్పటి నుంచే ఇమ్రాన్‌ ఖాన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఇమ్రాన్‌ మాజీ భార్య జెమిమా గోల్డ్‌ స్మిత్‌ కూడా ఉన్నారు.

పీటీపై పార్టీ ముందంజలో ఉండటంతో జెమిమా ‘22 ఏళ్ల అవమనాలకు ఫలితం ఇది’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జెమిమా చేసిన ట్వీట్‌లో ‘22 ఏళ్లుగా ఎన్నో అవమానాలు, త్యాగాలు, అడ్డంకులు. వీటన్నింటికి ఫలితం నేడు లభించనుంది. నా కొడుకు తండ్రే ప్రధాని కాబోతున్నారు. ఓటమిని అంగీకరించలేని వ్యక్తిత్వానికి నిదర్శనం ఈ ఫలితం. ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారో, దాన్ని సాధించడమే ఇప్పుడు మీ ముందు ఉన్న అతిపెద్ద సవాలు. శుభాకాంక్షలు ఇమ్రాన్‌ ఖాన్‌’ అంటూ అభింనందనలు తెలిపారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ తన 42 వ ఏట తన వయసులో సగం ఉన్న(21 ఏళ్లు) జెమిమా గోల్డ్‌ స్మిత్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందే జెమిమా ఇస్లాం మతంలోకి మారారు. వివాహమైన కొద్ది కాలానికే ఇమ్రాన్‌ ఖాన్‌ రాజకీయాల్లోకి ప్రవేశించారు. వివాహమైన తొమ్మిదేళ్ల, 2004లో తర్వాత జెమిమా - ఇమ్రాన్‌లు విడిపోయారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top