ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు న్యాయస్థానం మరోసారి భారీ షాక్ ఇచ్చింది. తోషాఖానా-2 అవినీతి కేసులో విచారణ జరిపిన కోర్టు, శనివారం (డిసెంబర్ 20) వీరికి చెరో 17 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పు ప్రకారం, పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 కింద నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు 10 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద మరో ఏడేళ్ల శిక్షతో పాటు, దంపతులిద్దరికీ చెరో రూ. 10 మిలియన్ల భారీ జరిమానా విధించారు.
సౌదీ అరేబియా ప్రభుత్వం నుండి 2021లో అందిన విలాసవంతమైన బహుమతులను వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేశారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. విదేశీ ప్రముఖులు ఇచ్చే విలువైన ఆభరణాలు, విలాసవంతమైన గడియారాలను ప్రభుత్వ నిధికి (తోషాఖానా) అప్పగించకుండా, తక్కువ విలువ చూపించి కొనుగోలు చేశారని ప్రాసిక్యూటర్లు నిరూపించారు. ఆ తర్వాత ఆ వస్తువులను బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి, కోట్లాది రూపాయల లాభం పొందారని దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఆరోపణలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇమ్రాన్ ఖాన్ 2022లో అధికారం కోల్పోయినప్పటి నుండి ఎదుర్కొంటున్న సుమారు 200 పైగా కేసుల్లో ఇది అత్యంత కీలకమైనది. గతంలో తోషాఖానా-1 కేసులో పడిన 14 ఏళ్ల శిక్షకు ఇది అదనం. దీంతో ఆయనకు చట్టపరమైన ఇబ్బందులు మరింత జటిలమయ్యాయి. అయితే ఈ తీర్పులను ఇమ్రాన్ పార్టీ అయిన 'పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్' (పీటీఐ) తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఒక న్యాయ హత్య అని, రాబోయే ఎన్నికల నుండి ఇమ్రాన్ను దూరం చేయడానికి సైన్యం, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు.

ఈ తాజా తీర్పు పాకిస్థాన్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దేశం ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, భద్రతా సవాళ్లతో సతమతమవుతున్న తరుణంలో, ఈ శిక్ష పీటీఐ మద్దతుదారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తీర్పు నేపధ్యంలో నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. తనను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పించేందుకే ఇన్ని కేసులు పెడుతున్నారని ఇమ్రాన్ వాదిస్తుండగా, ఇది అవినీతిపై చట్టం సాధించిన విజయమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు పీటీఐ నేతలు ప్రకటించారు.
Pakistan's Dawn reports - "A special court of the Federal Investigation Agency (FIA) on Saturday sentenced PTI founder Imran Khan and his wife Bushra Bibi to 17 years imprisonment in the Toshakhana-2 case. The case pertains to the purchase of an expensive Bulgari jewellery set,… pic.twitter.com/LOtVNMr9pq
— ANI (@ANI) December 20, 2025


